Parkinson’s disease : శారీరిక వ్యాధుల కంటే మానసిక వ్యాధులు అనేవి ఎక్కువగా మనుషులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మానసిక వ్యాధులు అనేవి మనుషులకు ఎలా సోకుతున్నాయి, వీటికి కారణాలు ఏంటి అని తెలుసుకోవడమే శాస్త్రవేత్తలకు పెద్ద ఛాలెంజ్లాగా మారింది. చాలావరకు ఇవి ఎందుకు సోకుతున్నాయో సమాధానం లేకపోవడం వల్లే వాటికి చికిత్సను అందించడం కూడా కష్టమయిపోతుంది. తాజాగా పార్కిన్సన్స్ గురించి శాస్త్రవేత్తలు ఒక కొత్త విషయాన్ని కనిపెట్టారు.
క్లీనింగ్ ఏజెంట్ లాగా ఉపయోగపడే కెమికల్ వల్ల పార్కిన్సన్స్ వచ్చే అవకాశం 70 శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ముఖ్యంగా ఇలాంటి కెమికల్ అనేది డ్రై క్లీనింగ్లో ఉపయోగిస్తుంటారు. దీనినే ట్రైక్లోరోథిలేన్ (టీసీఈ) అంటారు. ఈ కెమికల్ అనేది ఎన్నో దశాబ్దాలుగా గాలిలో, నీటిలో మాత్రమే కాదు.. మట్టిలో కూడా ఉండిపోయింది. ఇప్పటికే టీసీఈపై చేసిన పరిశోధనల్లో ఇది పలు క్యాన్సర్లకు కారణమవుతుందని తేలింది. ఇక తాజా పరిశోధనల్లో ఇది పార్కిన్సన్స్ రిస్క్ను కూడా పెంచుతుందని నిర్ధారణ అయ్యింది.
దాదాపు 100 ఏళ్ల నుండి ఇండస్ట్రియల్, కమర్షియల్ అవసరాల కోసం టీసీఈని ఉపయోగిస్తూ వచ్చారు. సర్జరీలలో కూడా దీనిని ఉపయోగించేవారు. కానీ 1977లో ఈ కెమికల్ను సర్జరీలలో ఉపయోగించడం నిషేధించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలలో ఉపయోగించే మెటల్ పరికరాల నుండి గ్రీజ్ను తొలగించడానికి దీనిని వినియోగిస్తున్నారు. గ్రీజ్ను తొలగించే క్రమంలో దీని నుండి భయంకరమైన కెమికల్ గాలిలో కలుస్తుంది. ఒక్కసారి టీసీఈ అనేది నేలలో కానీ, నీటిలో కానీ కలిస్తే ఎన్నో దశాబ్దాల వరకు అది అలాగే ఉండిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
నేవి, మెరీన్లో పనిచేసే ఉద్యోగులను శాస్త్రవేత్తలు పార్కిన్సన్స్ వ్యాధి కోసం పరీక్షించి చూశారు. ఆ క్రమంలో 1,60,000 మందిలో 430 మందికి పార్కిన్సన్ ఉందని తేలిందని, అంతే కాకుండా ఇతరులతో పోలిస్తే ఈ ఉద్యోగులకు పార్కిన్సన్స్ సోకే అవకాశం 70 శాతం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కేవలం ఇందులో పనిచేసే వారికి మాత్రమే కాకుండా సామాన్య ప్రజలకు కూడా టీసీఈ వల్ల ముప్పు పొంచి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇది భయంకరమైన కెమికల్ అని తెలిసినా కూడా ఇప్పటికీ అమెరికా వంటి దేశాల్లో దీని వినియోగం భారీగానే జరుగుతోంది.
టీసీఈతో నేరుగా పనిచేసిన వారి శరీరంలో మాత్రమే ఈ కెమికల్ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయని, మిగతావారికి అంతగా కనిపించవని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఆనవాళ్లు కనిపించినా లేకపోయినా ప్రభావం మాత్రం ఉంటుందని తెలిపారు. వాసనలు తెలియకపోవడం, నిద్రలేమి, డిప్రెషన్ లాంటివి పార్కిన్సన్స్ వ్యాధికి సూచనలు అని శాస్త్రవేత్తలు జాగ్రత్తలు చెప్తున్నారు. కానీ ఈ లక్షణాలు కొంతమందిలో మాత్రమే ఎక్కువగా బయటపడతాయని తెలిపారు. భవిష్యత్తులో పార్కిన్సన్స్తో బాధపడేవారి సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.