Jagan : ఏపీ సీఎం జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది. ప్రతిపక్షాలు ఈ వ్యవస్థపై తొలి నుంచి విమర్శలు గుప్పిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటోందని మండిపడుతున్నాయి. సీఎం జగన్ మాత్రం.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువచేయడంలో వాలంటీర్లే కీలక పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు.
ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వరుసగా మూడో ఏడాది అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్తమ వాలంటీర్లను సన్మానించారు. వారికి సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేశారు.
ప్రజలకు, ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు, సంక్షేమ సారథులు వాలంటీర్లు అని సీఎం వైఎస్ జగన్ ప్రశంసించారు. ప్రజలకు సేవలు చేస్తున్న 2.66 లక్షల మంది సైన్యమే వాలంటీర్ వ్యవస్థ అని పేర్కొన్నారు. 25 సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని తెలిపారు. తాను పెట్టుకున్న నమ్మకం వాలంటీర్లని చెప్పారు. ప్రజలకు వాలంటీర్ల ద్వారా మేలు జరుగుతోందని జగన్ స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు అరాచకాలకు పాల్పడ్డాయని సీఎం జగన్ విమర్శించారు. అందుకే తులసి మొక్కల్లాంటి వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చామన్నారు. ఈ ప్రభుత్వం ఫిలాసఫీకి ప్రతిరూపం వాలంటీర్లని పేర్కొన్నారు. అందుకే చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు వాలంటీర్ వ్యవస్థ అంటే కడుపులో మంట అని మండిపడ్డారు. డజన్ జెల్యుసిల్ మాత్రలు వేసినా కూడా వారి మంట తగ్గదన్నారు.
వాలంటీర్ల వ్యవస్థను రద్దుచేసి.. తిరిగి జన్మభూమి కమిటీలను తెస్తానని చంద్రబాబు అంటున్నారని జగన్ మండిపడ్డారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి, సీఎంకు బ్రాండ్ అంబాసిడర్లే వాలంటీర్లు అని జగన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను వారికి చూపించాలన్నారు. చేసిన మంచిపై ప్రజలు ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత మీదేనని సీఎం జగన్ వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు.