Congress : పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పట్టున్న లీడర్. అంగబలంతోపాటు అర్థబలం కూడా ఉంది. 2014లో వైఎస్ఆర్ సీపీ పార్టీ తరఫున ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ పార్లమెంట్ పరిధిలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. వారి విజయానికి పొంగులేటి ఇమేజ్ కారణమని అంటారు. ఆ తర్వాత ఆ ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు పొంగులేటి కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ టిక్కెట్ పొంగులేటికి దక్కలేదు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నా కేసీఆర్ టిక్కెట్ ఇవ్వలేదు. సైకిల్ దిగి కారెక్కిన నామా నాగేశ్వరరావుకు కేసీఆర్ ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో పొంగులేటి చేతిలోనే నామా ఓడిపోయారు.
ఎంపీ టిక్కెట్ ఇవ్వకపోయినా పొంగులేటి బీఆర్ఎస్ లోనే కొనసాగారు. 2019 ఎన్నికల తర్వాత నాలుగేళ్లు పార్టీలో కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొన్నారు. అయితే కొంతకాలంగా పార్టీపై బహిరంగ విమర్శలు దిగారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ గులాబీ పార్టీలో గుబులు రేపారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని గళమెత్తారు. పొంగులేటి ఆత్మీయ సమావేశాలకు అనుచరులు, అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న మరో సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు పొంగులేటితో జత కలిశారు. ఈ ఇద్దరూ నేతలు బీఆర్ఎస్ అధిష్టానంపై ఘాటైన విమర్శలు చేశారు. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
పొంగులేటి తొలుత బీజేపీలో చేరతారని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో పొంగులేటి ఇంటికి వెళ్లి బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత పార్టీ మార్పుపై పొంగులేటి క్లారిటీ ఇవ్వలేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాతే తన రాజకీయ నిర్ణయం ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. కర్ణాటకలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. ఆ ప్రభావం తెలంగాణపై పడింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. గతంలో బీజేపీలో చేరాలని యోచన చేసిన నేతలు ఆలోచనలో పడ్డారు. వారు ఇప్పుడు హస్తంవైపు ఆకర్షితులవుతున్నారు.
ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ఎంతో రాజకీయ చతురతను ప్రదర్శించారు. కాంగ్రెస్ లో నేతల చేరికలను ఆహ్వానించారు. ఈ క్రమంలో పొంగులేటి సానుకూలంగా స్పందించారు. ఇక పొంగులేటి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరడం లాంఛనమే. ముందుముందు కాంగ్రెస్ లో భారీగానే చేరికలు ఉండే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోనూ అధికారం దక్కడం ఖాయమేనా..?