Congress : కాంగ్రెస్ పార్టీ కుటుంబపార్టీ అనే విమర్శకుల నోళ్లు మూతబడే రోజు ఇది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు దళితుడి చేతికి వచ్చిన అపూర్వ ఘట్టం అది. గాంధీల నుంచి ఖర్గేకి నాయకత్వ బాధ్యతల మార్పు జరిగిన శుభతరుణం. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వెటరన్ లీడర్ మల్లిఖార్జున ఖర్గే.. సోనియా గాంధీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కొత్త అధ్యక్షుడికి పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు చెప్పాయి. ఖర్గే ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు తదితరులు హాజరయ్యారు.
ఎంతో అనుభవం, కష్టించి పనిచేసే తత్వం ఉన్న మల్లిఖార్జున ఖర్గే.. అధ్యక్ష పదవిలో మెరుగ్గా రాణిస్తారని.. అందరికీ స్పూర్తిగా నిలుస్తారని సోనియాగాంధీ ఆకాంక్షించారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్ష పదవి వరకూ తనను తీసుకువచ్చింది పార్టీయేనని అన్నారు ఖర్గే. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమన్నారు.
ఇటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో జోరు మీదున్నారు. అటు, కాంగ్రెస్ కు కొత్త నాయకుడు వచ్చారు. ఇకపై పార్టీ వ్యవహారాలు ఖర్గేనే చూసుకోనున్నారు. ఆయనకు గాంధీల నుంచి సీనియర్ల నుంచి ఎలాగూ సహకారం ఉంటుంది. కాకపోతే, ఆయన ముందున్న సవాళ్లు మామూలుగా లేవు. దేశంలో బీజేపీ దూకుడు రాజకీయాలు చేస్తోంది. ఈడీ కేసులతో నేరుగా సోనియానే కార్నర్ చేస్తోంది. మెజార్టీ రాష్ట్రాల్లో కమలానిదే అధికారం. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు చేపట్టిన మల్లిఖార్జున ఖర్గే శక్తిసామర్థ్యాలకు అగ్నిపరీక్షే. 2024 ఎన్నికల నాటికి పార్టీని గాడిలో పెట్టాల్సిన బాధ్యత. ఇప్పటికే రాజస్థాన్ లో అంతర్గత కుమ్ములాటలు. పలు రాష్ట్రాల పీసీసీల్లో లుకలుకలు. ఖర్గే నియామకంతో జీ22 నాయకులు సంతృప్తి చెందినట్టేనా?
త్వరలోనే జరగనున్న గుజరాత్ ఎలక్షన్లు ఆయన ఎదుర్కొనే మొదటి సవాల్. వచ్చే ఏడాది 10కిపైగా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా ఇలాంటి కీలక సమయంలో ఖర్గే.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఆసక్తికరం.