IPL Match Today(RCB vs SRH): ప్లేఆఫ్స్ ఆశలు నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దుమ్మురేపింది. విరాట్ కోహ్లి అద్బుత సెంచరీ, కెప్టెన్ డుప్లెసిస్ సూపర్ ఇన్నింగ్స్ తో కదంతొక్కారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. క్లాసెన్ సెంచరీ వృథా అయ్యింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (11) , రాహుల్ త్రిపాఠి (15), మార్ క్రమ్ (18) విఫలమైనా ఒకవైపు క్లాసెన్ (104, 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులు) ఒంటరి పోరాటం చేశాడు. సెంచరీతో అదరగొట్టాడు. హ్యారీ బ్రూక్ (27) చివరిలో మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది.
బెంగళూరు బౌలర్లలో బ్రాస్ వెల్ రెండు వికెట్లు, సిరాజ్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు. ముఖ్యంగా సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్ మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అందువల్లే హైదరాబాద్ స్కోర్ 200 దాటలేదు.
లక్ష్యఛేదనలో బెంగళూరు ధాటిగా ఇన్నింగ్స్ ను ఆరంభించింది. విరాట్ కోహ్లి, కెప్టెన్ డుప్లెసిస్ చెలరేగి ఆడారు. కోహ్లి (100, 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీ సాధించాడు. ఈ జోడి తొలి వికెట్ కు 172 పరుగులు జోడించింది. కోహ్లి అవుటైన వెంటనే డుప్లెసిస్ ( 71, 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు) కూడా అవుటయ్యాడు. మాక్స్ వెల్ (5 నాటౌట్), మైఖేల్ బ్రాస్ వెల్ (4 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. దీంతో 19.2 ఓవర్లలోనే బెంగళూరు విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ తలోవికెట్ తీశారు. అద్భుత సెంచరీతో చెలరేగిన ఛేజ్ మాస్టర్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.