Khammam: మంత్రి పువ్వాడ అజయ్కి బిగ్ షాక్ తగిలింది. ఖమ్మం లకారం చెరువులో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించింది. ఇస్కాన్, యాదవ సంఘాలు హైకోర్టులో పిటిషన్లు వేయగా.. విచారణకు స్వీకరించిన కోర్టు.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టొద్దని ఆదేశించింది. పువ్వాడ అజయ్ సహా నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది.
ఎన్టీఆర్ వందో జయంతి సందర్భంగా మే 28న విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నారు. 54 అడుగుల విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. 4 కోట్ల విరాళాలు వచ్చాయి. విగ్రహాన్ని జూనియర్ ఎన్టీఆర్తో ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో విగ్రహం చుట్టూ వివాదం ముసురుకుంది.
ఎన్టీఆర్ విగ్రహం శ్రీకృష్ణుడి గెటప్లో ఉండటమే వివాదానికి కారణం. తమ దైవం శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఎన్టీఆర్ రూపంలో ఏర్పాటు చేయడాన్ని యాదవ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి టైంలో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహానికి నివాళులు అర్పిస్తే.. మా దేవుడిని అపవిత్రం చేయడమేననేది యాదవ సంఘాల వాదన. అటు, నటి కరాటే కళ్యాణి సైతం విమర్శలు చేసి ‘మా’ నోటీసులు కూడా అందుకున్నారు.
శ్రీకృష్ణుడి గెటప్ లో ఎన్టీఆర్ విగ్రహం ఉండటంతో ముస్లింలు కూడా అభ్యంతరం చెబుతున్నారు. ఖిల్లా ఏరియాను ఆనుకొని ఉన్న లకారం ట్యాంక్ బండ్ మీద ఒక సామాజిక వర్గానికి చెందిన విగ్రహాన్ని అంత పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడం తమకు కూడా అభ్యంతరకరమేనని అంటున్నారు. ఇలా వివాదాల నడుమ విషయం హైకోర్టుకు చేరడం.. స్టే విధించడంతో.. విగ్రహ ఏర్పాటు సందిగ్థంలో పడింది.