Kiren Rijiju: కేంద్రలోని బీజేపీ పరువు కోసం బాగా పాకులాడుతుంటుంది. ఒక్క అదానీ విషయంలో మినహా.. ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు రాకుండా చాలా జాగ్రత్తగా మసులుకుంటుంది. అలాంటిది, సడెన్గా కేంద్రమంత్రి కిరణ్ రిజిజును న్యాయశాఖ నుంచి తప్పించింది. ఆయన్ను ‘భూ విజ్ఞానశాస్త్ర శాఖ’ మంత్రిగా నియమించింది. కేంద్రంలో అలాంటి శాఖ ఒకటి ఉంటుందని కూడా చాలామందికి తెలీదు. అంతటి అప్రధానమైన పోస్టు కట్టబెట్టారంటే.. ఆయనకు అది పనిష్మెంట్ అనేగా అర్థం? మిగతా మంత్రులెవరినీ టచ్ చేయకుండా.. కేవలం కిరణ్ రిజిజును మాత్రమే కీలక శాఖ నుంచి మార్చేయడం వేటు వేసినట్టేగా?..అంటున్నారు.
కిరణ్ రిజిజు నోటి దురుసే ఆయన శాఖ ఫసక్ అనేందుకు కారణంగా తెలుస్తోంది. కోర్టులను చిన్నమాట అనేందుకే అంతా భయపడుతుంటారు. అలాంటిది న్యాయవ్యవస్థపైనే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు కిరణ్. కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని సంచలన ఆరోపణలు చేశారు. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు తాను వ్యతిరేకం కాదంటూనే.. ప్రజల్లో అలాంటి భావన ఉందంటూ విమర్శలపాలయ్యారు. అక్కడితో ఆగలేదాయన. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వ పాత్ర తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉందంటూ.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్కు లేఖ కూడా రాశారు కిరణ్ రిజిజు.
కొలీజియంతో పాటు న్యాయవ్యవస్థపై కేంద్రమంత్రి చేస్తున్న వ్యాఖ్యలపై న్యాయవాద సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. రాజ్యాంగ ఔన్నత్యానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని.. కిరణ్ రిజిజును రాజ్యాంగబద్ధ పదవి నుంచి తప్పించాలని.. బాంబే లాయర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. అయితే, ఆ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో తాజాగా ఆయన్ను న్యాయశాఖ మంత్రిగా తప్పించింది కేంద్రం. మంత్రి పదవిపై వేటు వేయకుండా.. ప్రాధాన్యం లేని శాఖ కట్టబెట్టింది. మరోవైపు, కిరణ్ రిజిజు ఒక ‘ఫెయిల్డ్ లా మినిస్టర్’ అంటూ కాంగ్రెస్ పార్టీ కామెంట్ చేసింది. సోషల్ మీడియాలోనూ రిజిజుపై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన కిరణ్ రిజిజు ఢిల్లీ యూనివర్సిటీలో ‘లా’ చదివారు. మూడుసార్లు ఎంపీగా గెలిచారు. బీజేపీ ప్రభుత్వంలో మొదట యువజన వ్యవహారాలు, క్రీడలు, హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2021లో జరిగిన పునర్ వ్యవస్థీకరణలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ‘భూ విజ్ఞానశాస్త్ర శాఖ’కు పరిమితం అయ్యారు.