IPL : ప్లే ఆఫ్స్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ ( 101, 58 బంతుల్లో 13 ఫోర్లు,1 సిక్సు) సెంచరీతో అదరగొట్టాడు.
తొలి ఓవర్ లోనే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (0) అవుటైనా.. గిల్, సాయి సుదర్శన్ (47) తో కలిసి రెండో వికెట్ కు 147 పరుగులు జోడించాడు. ఆ దశలో గుజరాత్ స్కోర్ 200 దాటేలా కనిపించింది. కానీ సాయిసుదర్శన్ అవుటైన తర్వాత టపటపా వికెట్లు కోల్పోయింది. చివరి 6 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి.. 41 పరుగులు మాత్రమే చేసింది. భువనేశ్వర్ కుమార్ వేసిన చివరి ఓవర్ లో 4 వికెట్లు పడ్డాయి. దీంతో ఆ ఓవర్ లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి.
హైదరాబాద్ బౌలర్లు తొలుత భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే చివరిలో పుంజుకున్నారు. ముఖ్యంగా భువి 5 వికెట్లు తీసి గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశాడు. మార్కో జాన్సన్, ఫరూఖీ, నటరాజన్ తలో వికెట్ తీశారు.
189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఓటమి పవర్ ప్లే లోపు ఖరారైపోయింది. 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత సన్ రైజర్స్ ఇన్నింగ్స్ అలాగే సాగింది. 59 పరుగులకే 7 వికెట్లు పడ్డాయి. ఈ దశలో హెన్ రిచ్ క్లాసెన్ (64) ఒంటరి పోరాటం చేయడంతో జట్టు స్కోర్ 100 పరుగులు దాటింది. బ్యాట్ తోనూ భువి (27) మెరవడంతో జట్టు స్కోర్ 150 దాటింది. చివరకు 9 వికెట్లు కోల్పోయి హైదరాబాద్ 154 పరుగులు చేసింది.
గజరాత్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా పేసర్లు చెలరేగారు. షమి, మోహిత్ శర్మ చెరో 4 వికెట్లు పడగొట్టారు. యశ్ దయాల్ కు ఒక వికెట్ దక్కింది. అద్బుత సెంచరీతో అదరగొట్టిన గిల్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 9వ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉన్న గుజరాత్ ఇతర జట్ల ప్రదర్శనతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరింది. ఈ పరాజయంతో హైదరాబాద్ ఇంటిముఖం పట్టింది.