Shock For BJP : బీజేపీకి షాకుల మీద షాకులు. వరుసగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఇలా జంపింగ్స్ జరుగుతుండటంతో కమలనాథులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బూర నర్సయ్య గౌడ్ ను బీజేపీలో చేర్చుకుంటే.. అందుకు ప్రతీకారంగా స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్, బూడిద బిక్షమయ్య గౌడ్ లను కారులోకి లాగేసింది అధికార పార్టీ. ఆ వలసలను కంటిన్యూ చేస్తూ.. లేటెస్ట్ గా మరో బీజేపీ నేత రాపోలు ఆనంద్ భాస్కర్ సైతం పార్టీకి రాజీనామా చేయడం కలకలంగా మారింది.
మాజీ ఎంపీ, బీజేపీ నేత రాపోలు తన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు. ఇటీవలే ఆయన ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలవడం.. తాజాగా బీజేపీకి రాజీనామా చేయడంతో.. రాపోలు టీఆర్ఎస్ లో చేరడం ఖాయం.
రాపోలు ఆనంద్ భాస్కర్ సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కీలక పదవులు అనుభవించారు. కొద్దికాలం క్రితమే కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. అంతలోనే కేసీఆర్ విసిరిన వలకి చిక్కి.. కమలానికి కటీఫ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.
గులాబీ దళం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. కొద్ది రోజులుగా చేనేతపై కేంద్రం జీఎస్టీ విధించడానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున హడావుడి చేస్తోంది. మోదీపై లేఖాస్త్రాలు సంధిస్తోంది. ఇదే సమయంలో.. అదే సామాజిక వర్గానికే చెందిన రాపోలు ఆనంద్ భాస్కర్ చేనేతపై జీఎస్టీని వ్యతిరేకిస్తూ బీజేపీకి రాజీనామా చేయడం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ లో భాగమేనంటున్నారు. వలసలతో బీజేపీని దెబ్బ మీద దెబ్బ కొడుతూ.. వరుస షాకులు ఇస్తున్నారు. మరి, టీఆర్ఎస్ దూకుడుకు బీజేపీ ఎలా చెక్ పెడుతుందో?