CBI : సీబీఐ కొత్త డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ ప్రవీణ్ సూద్ ఎంపికయ్యారు. ప్రధాని, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ ప్రతిపక్ష నేతతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఆయనను సీబీఐ డైరెక్టర్ గా ఎంపిక చేసింది. ప్రవీణ్ సూద్ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం కూడా ఉంది.
ప్రవీణ్ సూద్ 1986 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ పదవీకాలం మే 25న ముగుస్తుంది.
రెండేళ్లుగా జైస్వాల్ ఈ పదవిలో ఉన్నారు.
ప్రధాని, సీజేఐ, లోక్సభ ప్రతిపక్ష నేతతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ శనివారం సమావేశమైంది. సీబీఐ కొత్త డైరెక్టర్ నియామకానికి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను పరిశీలించింది. కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్, మధ్యప్రదేశ్ డీజీపీ సుధీర్ సక్సేనా, తాజ్ హసన్ల పేర్లు పరిశీలించనట్లు తెలుస్తోంది. అయితే కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ సీబీఐ నూతన డైరెక్టర్గా ఎంపిక చేసింది.
కర్ణాటక ఎన్నికల సమయంలో డీజీపీ ప్రవీణ్ సూద్ వ్యవహారం వివాదంగా మారింది. తమ పార్టీ నేతలపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ కు మద్దతుగా పని చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీకి వంతపాడుతున్న డీజీపీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డీజీపీపై చర్యలు తీసుకుంటామని డీకే శివకుమార్ హెచ్చరించారు.
డీకే శివకుమార్ చెప్పినట్లుగా కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రోజే సీబీఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ ఎంపికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకముందే కేంద్రం ప్రవీణ్ సూద్ కు సీబీఐ డైరెక్టర్ గా ప్రమోషన్ ఇచ్చింది. మరి హస్తం నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.