Chandrababu : ఏపీ ప్రభుత్వం సంచలన చర్యలు చేపట్టింది. చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చింది. కృష్ణానది కరకట్టపై ఉన్న గెస్ట్హౌస్ను ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్ మెంట్ 1944 చట్టం ప్రకారం ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.
అధికారంలో ఉండగా అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ క్విడోప్రోకోకు పాల్పడ్డారని గతంలో సీఐడీ కేసు నమోదు చేసింది. CRDA మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్లలో అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్హౌస్ పొందారనేది ప్రధాన ఆరోపణ. చట్టాలను, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారని అభియోగాలు నమోదు చేసింది.
వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కు అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్హౌస్ తీసుకున్నారని చంద్రబాబుపై ఆరోపణలున్నాయి. క్రిమినల్ లా అమెండ్ మెంట్ 1944 చట్టం ప్రకారం ఆ గెస్ట్ హౌస్ ను అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని సీఐడీ కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గెస్ట్హౌస్ను అటాచ్ చేసింది. ఈ విషయంపై స్థానిక జడ్జికి సమాచారం ఇచ్చింది.
లింగమనేని రమేష్ కు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారని గతంలో వైసీపీ నేతలు ఆరోపించారు. తన ఆస్తలు విలువ పెంచుకునేందుకు రైతులకు నష్టం చేస్తూ రాజధాని ప్లాన్ మార్చారని విమర్శించారు. లింగమనేని వద్దే హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేసిందని ఆరోపించారు.
రాజధానిలో బినామీల పేరుతో టీడీపీ నేతలు భూమలు కొనుగోలు చేశారని వైసీపీ నేతలు గతంలో విమర్శించారు. రాజధాని స్టార్టప్ ప్రాంతంలో నారాయణ భూములు కొన్నారని ఆరోపించారు. రూ.3.66 కోట్లతో 2015 జూన్, జులై, ఆగస్టులో ఈ భూములు కొనుగోలు చేశారని సీఐడీ గుర్తించింది. నారాయణ విద్యాసంస్థల ఉద్యోగి పొత్తూరి ప్రమీల, ట్రెజరర్ రాపూరు సాంబశివరావు పేరుతో భూములు కొన్నారని నిర్ధారించింది.