Annavaram Sri Satyanarayana Swamy Temple :- తిరుమల తిరుపతి దేవస్థానం బాటలోనే ప్రముఖ దేవాలయాలు నడుస్తున్నాయి. మారుతున్న కాలానికి తగ్గట్టు భక్తులకి సేవలు అందించేందుకు దారులు అన్వేషిస్తున్నాయి. టెక్నాలజిని వాడుతున్నాయి. ప్రముఖ దివ్యక్షేత్రం అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి దేవస్థానం ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. www.aptemples.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ సేవల్ని భక్తుల చెంతకు తెచ్చింది. స్వామివారి పూజ, దర్శనం, టికెట్లు ప్రసాదం, వసతిగదులు, అన్నదానం సహా అన్ని సేవల్ని ఈ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చు. కొండపై ఏర్పాటు చేసిన కల్యాణ మండపాలను కూడా ఈ వెబ్ సైట్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చు. మాసంతో సంబంధం లేకుండా నిత్యం భక్తులు అన్నవరం సత్యనారాయణస్వామి వ్రతం నోచుకుని స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.
అందుకే ఆలయ ప్రాంతం నిత్యం భక్తుల సందడిగా కనిపిస్తుంది. పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరిపై స్వామి వారు కొలువుదీరారు. ఈ పుణ్యక్షేత్రం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులోఉంది. గుడికి మెట్లమార్గం కూడా ఉంది. 460 మెట్లు ఎక్కితే ఆలయాన్ని చేరుకోవచ్చు. ప్రతీ ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం కన్నులపండుగా నిర్వహిస్తారు. హరిహరులు ఒక్కటే వారికి బేధం లేదని నిరూపించేలా సత్యన్నారాయణ స్వామి పక్కనే శివుడు కూడా భక్తులతో పూజలందుకుంటాడు. అడిగిన వెంటనే వరాలు ఇచ్చే దేవుడిగా సత్యనారాయణస్వామి వందల సంవత్సరాలుగా పూజలందుకుంటున్నాడు .
ఆంధ్ర ప్రాంతంలో పెళ్లైన వెంటనే అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకుని వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయానికి రాలేని వారు పెళ్లైన మర్నాడే ఇంట్లో వ్రతాన్ని బంధు మిత్రుల సమక్షంలో ఆచరిస్తుంటారు. అంతగా అన్నవరం ఆలయం భక్తుల జీవితంలో భాగంగా మారిపోయింది.