BJP : కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ వ్యూహాలు బెడిసికొట్టాయి. పార్టీ ఓటమికి పనిచేసిన కారణాల్లో గుజరాత్ ఫార్ములా కూడా ఒకటని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కర్ణాటకలోనూ 75 మంది కొత్తవారికి టికెట్లు ఇచ్చింది. కానీ వారిలో కేవలం 15 మంది మాత్రమే ఎన్నికల్లో గెలిచారు. అదీ కూడా స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. బీజేపీ ఈసారి టిక్కెట్ నిరాకరించిన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 10 మంది కాంగ్రెస్, జేడీఎస్లో చేరి ఘన విజయం సాధించడం మరో విశేషం. బీజేపీ ఘోర పరాజయానికి ఇదొక కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
టికెట్ల కేటాయింపు వ్యవహారంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి హైకమాండ్ను తప్పుదారి పట్టించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సిట్టింగ్లకే టికెట్లు ఇచ్చి ఉంటే పార్టీ పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం నెలకొంది. ఈ ఘోర ఓటమికి కారణం బీఎస్ సంతోష్, ఆయనే ఓటమికి బాధ్యతను తీసుకోవాలని కమలనాథులు చర్చించుకుంటున్నారని తెలుస్తోంది.
కర్ణాటక ప్రాంతానికి చెందిన బీఎల్ సంతోష్ అభ్యర్థుల ఎంపికలో కీలకపాత్ర పోషించి పార్టీని సర్వనాశనం చేశారని కాషాయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్ఠానానికి తప్పుడు నివేదికలు పంపించడం, సీఎంను మార్చడం, అభ్యర్థుల ఎంపిక ఇవన్నీ సంతోష్ నిర్వాకం వల్లే జరిగాయని నమ్ముతున్నారు. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించగా, బీజేపీ మాత్రం గుజరాత్ ఫార్ములా ప్రయోగించి చతికిలపడిందని పరిశీలకులు అంటున్నారు.