Jallikattu: ఇన్నాళ్లు తప్పన్నారు. ఇప్పుడు ఒప్పంటున్నారు. ఇన్నేళ్లూ ఆడోద్దన్నారు. ఆడితే అడ్డుకుంటామన్నారు. ఇప్పుడు మీ ఇష్టం.. ఆడుకోండని తేల్చేశారు. ఇప్పటి వరకూ జంతు హింస, ప్రమాదకర క్రీడ.. అదీఇదీ అన్నారు. ఇప్పుడు అలాంటిదేమీ లేదంటూ బుల్ ఫైట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది సుప్రీంకోర్టు. తాజా తీర్పుతో తమిళతంబిలు తెగ ఖుషీ అవుతున్నారు. సంక్రాంతి ఎప్పుడొస్తుందా.. ఎద్దు మెడలు ఎప్పుడు వంచుదామా.. అని తొందరపడుతున్నారు.
జల్లికట్టు. తెలుగువారికి అంతగా పరిచయం లేదుకానీ, తమిళనాడుతో విడదీయరాని అనుబంధం. వారి సంప్రదాయం. అసలే తమిళులు. కల్చర్ అంటే ప్రాణాలు పెడతారు. అందుకే, కోర్టులు వద్దన్నా, పోలీసులు అడ్డుకున్నా.. జల్లికట్టును కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వారి పంతమే ఫలించింది. జల్లికట్టు ఆడుకోవచ్చని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. జంతుహింస చట్టం ఈ ఆటకు వర్తించదని స్పష్టం చేసింది. జల్లికట్టుపై తమిళనాడు సర్కారు చేసిన చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును.. తాజాగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం సవరించింది. తమిళ సంస్కృతిలో జల్లికట్టు ఓ భాగమనే వాదనను అంగీకరించింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.
2014లో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాట పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. జల్లికట్టును ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ చట్టం నుంచి తొలగిస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2017లో జల్లికట్టుకు అనుకూలంగా తమిళనాడు సర్కారు కొత్త యాక్ట్ తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. జల్లికట్టుతో జంతువులు, మనుషులు గాయపడే ప్రమాదం ఉందని, హింసతో కూడిన ఈ ఆటను నిషేధించాలని కోర్టుకు వెళ్లారు. జల్లికట్టు క్రీడలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్నిజాగ్రత్తలు తీసుకుంటామని తమిళనాడు ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. జల్లికట్టులో హింస ఉంటుందని, అంత మాత్రాన దాన్ని నెత్తుటి క్రీడ అనలేమంటూ.. జల్లికట్టు నిర్వహణకు జై కొడుతూ తుదితీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు.