BRS: రాజకీయ పార్టీలకు విరాళాలే ప్రధాన ఆర్ధిక వనరు. పార్టీని అభిమానించే వారు, కార్పొరేట్ సంస్థలు, కార్యకర్తలు ఇచ్చే విరాళాల లెక్కలు మొన్నటి వరకు కాస్త పారదర్శకంగా ఉండేవి. కానీ ఇప్పుడు పొలిటికల్ పార్టీలకు.. గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి కోట్లకు కోట్లు వచ్చి పడుతున్నాయి. అవి ఎవరు ఇస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ఎవరికి తెలియదు. తెలంగాణలోని బీఆర్ఎస్కు 2021–22 ఆర్థిక సంవత్సరంలో గుప్త విరాళాలు 153 కోట్లు వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ రిపోర్టులో తేలింది. 27 ప్రాంతీయ పార్టీల ‘ఇన్కమ్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్మీద రూపొందించిన నివేదిక విడుదల చేసింది.
అన్ నోన్ సోర్సెస్ నుంచి అధిక విరాళాలు వచ్చిన పార్టీగా బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలిచింది. 2021–22లో ఆ పార్టీకి 218 కోట్ల విరాళాలు రాగా.. అందులో 153 కోట్లు గుప్త విరాళాలేనని ఏడీఆర్ వెల్లడించింది. అంటే.. పార్టీకి వచ్చిన మొత్తం విరాళాల్లో గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చినవే 70 శాతం. కాగా, అన్నోన్ సోర్సెస్ నుంచి అధిక ఆదాయం వచ్చిన పార్టీల జాబితాలో తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే మొదటి స్థానంలో ఉంది. ఆ పార్టీకి 306 కోట్లు గుప్త విరాళాల రూపంలోనే వచ్చాయి. ఆ తర్వాత 291 కోట్ల గుప్త విరాళాలతో ఒడిశాలోని అధికార పార్టీ బీజేడీ రెండో స్థానంలో నిలిచింది. 60 కోట్ల అన్నోన్ సోర్సెస్ విరాళాలతో ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్సీపీ నాలుగో స్థానంలో ఉంది.
2021–22కు సంబంధించి 27 రీజనల్ పార్టీలకు మొత్తంగా వెయ్యి 165 కోట్ల రూపాయలు విరాళాల ద్వారా వచ్చాయి. అందులో 887 కోట్లు అన్నోన్ సోర్సెస్ ద్వారానే వచ్చినట్లు ఏడీఆర్ రిపోర్టు స్పష్టం చేసింది. మొత్తం విరాళాల్లో గుప్త విరాళాల వాటానే 76 శాతం. నోన్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఆదాయం 278 కోట్లు. డీఎంకే పార్టీకి వచ్చిన మొత్తంలో గుప్త విరాళాల వాటానే 96 శాతం. బీజేడీకి వచ్చిన గుప్త విరాళాల వాటా 94 శాతం. వాస్తవానికి అంతకుముందు ఏడాది 2020–21లో కేవలం 49.73 శాతంగా ఉన్న రీజనల్ పార్టీల గుప్త విరాళాలు.. ఇప్పుడు 76 శాతానికి చేరాయి. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం రూ. 20 వేల పైన డొనేషన్లకు కచ్చితంగా దాతల పేర్లను వెల్లడించాల్సి ఉంటుంది. రూ.20 వేలలోపు వాటికి పేర్లను చెప్పాల్సిన పనిలేదు. ఇది పార్టీలకు కలిసి వస్తున్నది.