USA: అగ్రరాజ్యం అమెరికా కష్టాల్లో పడింది. ఆ దేశాన్ని నిధుల కటకట వెంటాడుతోంది. ఇప్పటికే అమెరికా అప్పుల చిట్టా గరిష్ట పరిమితికి చేరింది. దీంతో బైడెన్ సర్కార్ లోన్స్ తెచ్చుకునేందుకు అమెరికా పార్లమెంట్ కళ్లెం విధించింది. దీంతో డెమెక్రటిక్ సర్కార్ అయోమయంలో పడిపోయింది.
అసలే మాంద్యం, ద్రవ్యోల్బణం, కొలువుల సమస్యలతో సతమతమవుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికాను మరో ఆర్థిక బూచి భయపెడుతోంది. అదే జో బైడెన్ ప్రభుత్వ మెడపై వేలాడుతున్న దివాలా కత్తి. అప్పుల పరిమితిని పెంచడానికి కాంగ్రెస్ ఆమోద ముద్ర వేయకపోవడంతో అమెరికా ప్రభుత్వం డబ్బులకు కటకటలాడుతోంది.
ఆదాయం కంటే వ్యయం పెరిగినప్పుడు ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. ఇందుకోసం ప్రధానంగా బాండ్లు విడుదల చేస్తాయి. నిర్దిష్ట సమయంలో తిరిగి చెల్లించడమేగాకుండా.. అప్పటిదాకా వడ్డీ చెల్లిస్తామని హామీ ఇస్తాయి. అమెరికా అదే చేస్తోంది. 2021 నాటికి అమెరికా ప్రభుత్వం తీసుకున్న అప్పు 28 ట్రిలియన్ డాలర్లు. దేశ జీడీపీ కంటే ఇది 24శాతం ఎక్కువ. ఇందులో ఎక్కువ మొత్తం దేశీయంగా సేకరించగా సుమారు 7 ట్రిలియన్ డాలర్లను విదేశాల నుంచి సేకరించింది. జపాన్, చైనాల నుంచి బాండ్లు కొనుగోలు చేసినవారూ ఎక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి 31.4 ట్రిలియన్ డాలర్లు. ఇదీ దాటి అప్పులు చేయడానికి బైడెన్ ప్రభుత్వం కాంగ్రెస్ అనుమతి కోరుతోంది. కానీ ప్రతినిధుల సభలో సంఖ్యాపరంగా ఆధిక్యంలో ఉన్న రిపబ్లికన్లు అప్పు పరిమితి పెంపునకు ససేమిరా అంటున్నారు. మరింత అప్పు అంటే ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ లేనట్లేనని, భవిష్యత్ ఖర్చులు తగ్గించుకోవాలని వాదిస్తున్నారు. బైడెన్తో రిపబ్లికన్ల చర్చలు సాగుతున్నా కొలిక్కి రావడం లేదు.
మరోవైపు అమెరికా ఆర్థిక మంత్రి యెలెన్ ఇప్పటికే చేతులెత్తేశారు. పరిమితి పెంచకుంటే జూన్ ఒకటోతేదీ లోపు ఏ క్షణమైనా ప్రభుత్వ చెల్లింపులు ఆగిపోతాయని ప్రకటించారు. అప్పుల పరిమితికి ప్రభుత్వం చేరుకుందంటే అదనంగా అప్పులు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బులు, పన్నుల ద్వారా వచ్చే సొమ్మునే ప్రభుత్వం ఖర్చు చేయగలుగుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం అప్పులు, వడ్డీలు, బిల్లులు తీర్చలేని పరిస్థితి వస్తుందో అది సాంకేతికంగా దివాలా తీసినట్లుగా భావిస్తారు.
అమెరికా చరిత్రలో ప్రభుత్వం చెల్లింపులు జరపలేని పరిస్థితి ఇప్పటిదాకా రాలేదు. వస్తే ఇదే తొలిసారి అవుతుంది. అదే జరిగితే అమెరికాలోనే కాకుండా అంతర్జాతీయంగా తీవ్రమైన ఆర్థిక విపరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో పడతాయి. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, సైన్యానికి జీత భత్యాలు ఆగిపోతాయి. ప్రభుత్వం అందించే సంక్షేమ నిధులపై ఆధారపడే అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడతారు. వడ్డీ రేట్లు విపరీతంగా పెరుగుతాయి. ఫలితంగా రుణాలు, క్రెడిట్ కార్డులపై అధికంగా చెల్లించాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలి… చివరికది భారీ నిరుద్యోగంతో ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. ‘అమెరికా తాత్కాలికంగా స్వల్పకాలానికి బిల్లులు చెల్లించలేని పరిస్థితి తలెత్తినా 80 లక్షల ఉద్యోగాలు పోతాయి. ప్రపంచ ఆర్థిక రంగానికి చోదకంగా నడుస్తున్న డాలర్ ప్రాబల్యం ప్రమాదంలో పడుతుంది.