Karnataka: కర్ణాటక పవర్గేమ్కు ఎట్టకేలకు శుభంకార్డు పడింది. ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఏకాభిప్రాయం సాధిస్తామన్న హైకమాండ్ ఆ దిశగా సక్సెస్ అయింది. డిప్యూటీ సీఎంగా ఉండేందుకు డీకే శివకుమార్ అంగీరించారు. దీంతో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యకు లైన్ క్లియర్ అయింది.
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై నాలుగురోజులుగా మల్లగుల్లాలు పడుతున్నారు. సీనియర్ పొలిటీషియన్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సీఎం కుర్చీ అప్పగించనున్నారు. అందుకు పవర్ షేరింగ్ ఫార్ములాను హైకమాండ్ తెరపైకి తెచ్చింది. అందుకు డీకే ససేమిరా అన్నారు. ఆయన్ను ఒప్పించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించినా.. సోనియాగాంధీ స్వయంగా ఫోన్ చేయడంతో డీకే వెనక్కు తగ్గారు.
హైకమాండ్ ఫార్ములాకు ఓకే చెప్పారు డీకే శివకుమార్. దానిప్రకారం సిద్ధరామయ్య సీఎం అవుతారు. డీకే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు. డీకే వర్గానికి కొన్నికీలక మంత్రిత్వశాఖలు కేటాయిస్తారు. పార్లమెంట్ ఎన్నికలే తమ తదుపరి టార్గెట్ అంటున్నారు డీకే శివకుమార్.
కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తొలినుంచీ చెప్తూ వచ్చారు డీకే శివకుమార్. పార్టీ కోసం కష్టపడిన తనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుపట్టారు. అయితే సిద్ధరామయ్య కూడా రేసులో నిలవడంతో ఆయనవైపే హైకమాండ్ మొగ్గు చూపింది. దీంతో చర్చలు జరిగాయి. కర్ణాటక రాజకీయం మొత్తం ఢిల్లీలో కేంద్రీకృతమైంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్ మధ్య చర్చోపచర్చలు జరిగాయి. అయితే.. సోనియాగాంధీ రంగంలోకి దిగి డీకే శివకుమార్కు ఫోన్ చేయడంతో కసరత్తు కొలిక్కి వచ్చింది.