Gangamma Jatara: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఏడు రోజుల పాటు జరిగిన గంగమ్మ జాతరలో వివిధ రకాల వేషాలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. బుధవారం తెల్లవారజామున జరిగిన విశ్వరూప సందర్శన, చెంప నరుకుడు కార్యక్రమంతో జాతర ముగిసింది. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత వచ్చిన తొలి జాతర కావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
గంగమ్మ జాతర చిత్తూరు జిల్లాలో ప్రతి గ్రామంలో జరుగుతుంది. ఏప్రిల్, మే నెలల్లో జాతర వాతావరణం ప్రతీ గ్రామంలోనూ కనిపిస్తుంది. అయితే తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గంగమ్మను ఏడుకొండల వేంకటేశ్వరుడికి సోదరిగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పాలెగాళ్ల అరాచకాల నుంచి తమను కాపాడేందుకు ఉద్భవించిన దేవతగా భావించి మొక్కలు చెల్లించుకుంటారు.
గంగమ్మ ఆలయంతో పాటు తిరుపతిలోని వేషాలమ్మ గుడిలోనూ ఏడు రోజుల పాటు జాతర జరిగింది. తాజాగా పుష్ప-2లో అల్లు అర్జున్ గెటప్ తో చాలమంది అమ్మవారిని దర్శించుకున్నారు. పులివేషాలు, జానపద వేషాలు, కృష్ణుడు, రాముడు, ఈశ్వరుడు లాంటి వేషాలతో అమ్మవారిని దర్శించుకున్నారు.
కుంబాభిషేకానికి కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి, గణపతి సచ్చిదానందతో పాటు రాజగురువు విశాఖ శారద పీఠాధిపతులు అమ్మవారిని దర్శించుకొని పూజులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి రోజా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సారి ప్రతిరోజూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సారెలు సమర్పించారు.
ఏడు రోజులు పాటు తిరుపతి గంగమ్మ నామ స్మరణతో నిండిపోయింది. వీధులలో అమ్మవారి జాతర ప్లేక్సీలతో పాటు వాడవాడలా ఉత్సవ విగ్రహాలు వెలిశాయి. అమ్మవారి పాటలు డీజేలలో మారుమోగాయి. మరో ఐదు వారాల పాటు అమ్మవారికి పొంగల్లు పెట్టి మొక్కులు తీర్చుకోనున్నారు భక్తులు.