Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. వివేకా హత్య కేసు విచారణలో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు అవినాష్రెడ్డి. అయితే ఆయన వేసిన పిటిషన్ విచారణ తేదీని సీజేఐ ధర్మాసనం ఖరారు చేయలేదు. తక్షణ విచారణకు అనుమతి ఇవ్వలేదు. విచారణ అత్యవసరమైతే రాతపూర్వకంగా అభ్యర్థన ఇవ్వాలని సీజేఐ సూచించింది. దీంతో అవినాష్ రెడ్డి పిటిషన్ విచారణ వేసవి సెలవుల్లోనే ఉండనుంది. మెన్షనింగ్ లిస్ట్ను వినకుండానే బ్యాచ్ల వారీగా తేదీలు కేటాయిస్తామన్నారు సీజేఐ.
వివేకా హత్య కేసు దర్యాప్తులో మంగళవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విచారణకు హాజరుకావాలని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే హైదరాబాద్లోనే ఉన్నా విచారణకు రాలేనని చివరి నిమిషంలో సీబీఐకి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. ముందస్తు కార్యక్రమాలను కారణంగా చూపారు. విచారణకు 4 రోజుల సమయం కావాలని కోరారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి కడపకు వెళ్లారు.
అవినాష్ రెడ్డి వెళ్లగానే.. సీబీఐ బృందం కూడా కడపకు వెళ్లింది. అవినాష్రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన డ్రైవర్ కు నోటీసులు అందించింది. ఈ నెల 19న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. వివేకా హత్య కేసు దర్యాప్తు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తుపై ఉత్కంఠ పెరుగుతోంది. అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదనే ప్రచారం సాగుతోంది.