Karnataka Election News(Telugu breaking news) : భారత్ జోడో యాత్రతో కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి తొలి అడుగు పడింది. బసవరాజ్ బొమ్మై సర్కార్ అవినీతిని ఎండగడుతూ రాహుల్ గాంధీ ముందుకుసాగారు. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచడంలో సక్సెస్ అయ్యారు. రాహుల్ పాదయాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చింది. నేతలు కలిసికట్టుగా పనిచేయడం మొదలుపెట్టారు. కాషాయ ప్రభుత్వంపై రాష్ట్ర నేతలు విమర్శల దాడిని పెంచారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని పదేపదే విమర్శలు చేశారు.
ఏఐసీసీ అధ్యక్ష పదవి దళిత నేత మల్లికార్జున్ ఖర్గేకు కట్టబెట్టడం కాంగ్రెస్ కు బాగా బూస్టింగ్ ఇచ్చింది. ఖర్గే కర్ణాటకకే చెందిన వ్యక్తికావడంతో ప్లస్ పాయింట్ గా మారింది. దళిత ఓటర్లు పూర్తిగా కాంగ్రెస్ వైపే మొగ్గుచూశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య ఇమేజ్ పార్టీకి బలంగా మారింది. డీకే శివకుమార్ దూకుడు రాజకీయం బీజేపీకి చెక్ పెట్టేలా చేసింది. ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ల త్రయం బేషజాలకు పోకుండా కలిసి పనిచేశారు. కాంగ్రెస్ కు విజయాన్ని అందించారు.
ఎప్పుడూ గ్రూప్ తగాదాలతో ఓటర్లలో వ్యతిరేకత పెంచుకునే కాంగ్రెస్.. కన్నడనాట మాత్రం ఐక్యమత్యంతో విజయాన్ని అందుకుంది. నేతల మధ్య పెద్ద వివాదాలేమి కాంగ్రెస్ పార్టీలో ఏర్పడలేదు. ఆధిపత్యపోరు కనిపించలేదు. ఎన్నికలముందే సీఎం పదవి నాదంటే నాదే అనే వాదనలు సాగలేదు. ఈ విషయంపై అసలు పెద్దగా చర్చే జరగలేదు. అంతర్గత ఆధిపత్య పోరుకంటే బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతోనే నేతలందరూ పనిచేశారు. టార్గెట్ రీచ్ అయ్యారు.
చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నా ఓడిపోవడానికి పార్టీలో గ్రూప్ తగాదాలు కారణమవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంది. కర్ణాటకలాగే తెలంగాణలోనూ పనిచేస్తే అధికారం దక్కడం ఖాయమనే అంచనాలున్నాయి.