Telangana : తెలంగాణలో జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మె మరింత ఉద్ధృతంగా మారుతోంది. తమ సర్వీసు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జేపీఎస్ లు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలు తెలిపారు. ఇక నుంచి వినూత్న పద్ధతుల్లో ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సర్పంచుల నుంచి వారి మద్దతు రోజురోజుకు పెరుగుతోంది.
ఓ మహిళా జేపీఎస్ ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. తన ఉద్యోగం పర్మినెంట్ కాదనే ఆందోళనతో ఆమె బలవన్మరణానికి పాల్పడిందని జేపీఎస్లు అంటున్నారు. వారి కార్యక్రమాలు 16వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లాలో ట్యాంక్బండ్పై బతుకమ్మ ఆడి ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వినూత్నంగా నిరసన తెలిపారు. ‘భద్రాద్రి రామయ్యా.. రెగ్యులరైజేషన్ జీవో ఇప్పించయ్యా’ అనే బ్యానర్ను ప్రదర్శించారు. గోదావరి నదిలో దిగి నిరసన తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 12,769 పంచాయతీలున్నాయి. అందులో 3 వేల మందికిపైగా పర్మినెంట్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. 9,350 గ్రామపంచాయతీల్లో 8 వేలకుపైగా జేపీఎస్లు, వెయ్యిమంది ఓపీఎస్లు విధులు నిర్వహిస్తున్నారు. గత నెల 11న 6 వేల మంది జేపీఎస్లకు 4 ఏళ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తైంది. అయినాసరే ఉద్యోగాలను ప్రభుత్వం పర్మినెంట్ చేయలేదు. దీంతో తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసు ఇచ్చారు. గత నెల 28 నుంచి ఆందోళన చేస్తున్నారు.
గత మంగళవారం సాయంత్రంలోగా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్చరించారు. దీంతో 600 మంది జేపీఎస్లు తిరిగి విధుల్లో చేరారు. అయితే వారిలో చాలామంది ఆ తర్వాత రోజు నుంచి మళ్లీ నిరసనల్లో పాల్గొంటున్నారు.
సర్వీసుల క్రమబద్ధీకరణ జీవో జారీ చేయాలని జేపీఎస్ లు కోరుతున్నారు. నాలుగేళ్ల ప్రొబేషనరీ కాలాన్ని సర్వీసుగా పరిగణించాలని అడుగుతున్నారు. ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జేపీఎస్లుగా ప్రమోట్ చేయాలనేది మరో డిమాండ్. వారు పనిచేసిన కాలాన్ని ప్రొబేషన్గా పరిగణించి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నేటి మధ్యాహ్నంలోగా జేపీఎస్లు విధుల్లో చేరాలన్న సీఎస్ ఆదేశించారు.