.
AP High Court on GO No 1(Andhra Pradesh latest news): ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. రాష్ట్రంలో రోడ్డ్ షోలు, బహిరంగ సభల నిర్వహణపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 ను కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని హైకోర్టు పేర్కొంది.
ఈ ఏడాది జనవరి 2న ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 1ను తీసుకొచ్చింది. ఈ జీవోను సవాల్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే జీవోపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఐఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ప్రతిపక్షాలు రోడ్లపై నిర్వహించే కార్యక్రమాలను జీవో నంబర్ 1 ద్వారా అడ్డుకునే ప్రమాదం ఉందని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ జీవోను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్లపై జనవరి 24న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కానీ తీర్పును రిజర్వు చేసింది. అయితే తాజాగా ఆ జీవోను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతిచెందారు. ఈ రెండు ఈ ఘటనల్లో మొత్తం 11 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రభుత్వం రోడ్లపై ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధించింది. అందుకోసమే జీవో నంబర్ 1 ను తీసుకొచ్చింది. ర్యాలీలు, సభలకు ఆంక్షలు విధించడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈ జీవోను ఉపసంహరించాలని ఆందోళన చేపట్టాయి. అలాగే మరోవైవు న్యాయపోరాటం చేశాయి. మరి హైకోర్టు ఆ జీవో కొట్టివేయడంతో వైసీపీ ప్రభుత్వం నెక్ట్స్ స్టెప్ ఏంటి?