ImranKhan: చంపేస్తారనుకున్నారు. తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆయనే అన్నారు. తమ నాయకుడి అరెస్టుపై PTI దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, అల్లర్ల చేస్తోంది. మూడురోజులుగా పాకిస్తాన్లో రచ్చ రంభోలా జరుగుతోంది. హైకోర్టులో విచారణకు వచ్చిన ఇమ్రాన్ఖాన్ను భారీ బలగంతో, బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లింది ఆర్మీ. అవినీతి ఆరోపణలతో అరెస్ట్ చేశామని ప్రకటించింది. తన అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇమ్రాన్ఖాన్. అత్యున్నత న్యాయస్థానంలో రిలీఫ్ లభించింది. తాను ఇక ప్రాణాలతో తిరిగా వస్తానో లేదోనని తెగ టెన్షన్ పడిన మాజీ ప్రధానికి.. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రాణం పోసినట్టైంది.
పాకిస్థాన్ సుప్రీంకోర్టులో మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ఊరట లభించింది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్ట విరుద్ధమని న్యాయస్థానం తీర్పు చెప్పింది. అల్లర్లను ఆపాలని ఇమ్రాన్ ఖాన్కు సుప్రీంకోర్టు సూచించింది. గంటలో తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన్ను సుప్రీంకోర్టు ముందు హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ సర్వోన్నత న్యాయస్థానానికి క్షమాపణలు తెలిపాడు. 72 గంటల పాటు వరుసగా ఆందోళనలు జరగడంపై మన్నించాలని కోరాడు. తనను లాఠీలతో కొట్టారని సుప్రీంకోర్టు ముందు వాపోయాడు. దీంతో సుప్రీంకోర్టు ISI డీజీకి సమన్లు ఇష్యూ చేసింది. ఆర్మీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకుముందు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ న్యాయబద్ధంగానే జరిగిందని ఇస్లామాబాద్ హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు మాత్ర ఆయన్ను రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఇమ్రాన్ అరెస్టుతో ఆయన మద్దతుదారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ, గుజ్రాన్వాలా, ఫైసలాబాద్, ముల్తాన్, పెషావర్, మర్దాన్ వీధులు.. ఇమ్రాన్ మద్దతుదారులతో కిక్కిరిసిపోయాయి. ఇళ్లు, వాహనాలు, కార్యాలయాలపై రాళ్ల దాడికి దిగుతున్నారు. రోడ్లపై బ్యానర్లు, టైర్లు తగలబెట్టి బ్లాక్ చేశారు. ఆందోళనకారులు రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలోకి చొరబడ్డారు. ప్రధాన గేటును విరగొట్టారు. వారిని నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాహోర్లో కార్ప్స్ కమాండర్ ఇంటిని తగలబెట్టారు.
మొబైల్ డేటా సర్వీసులపై పాక్ ప్రభుత్వం నిషేధం విధించింది. సోషల్ మీడియాపై కూడా అప్రకటిత నిషేధం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇస్లామాబాద్ లో 144 సెక్షన్ అమలవుతోంది. అయితే పోలీసుల ఆజ్ఞలను PTI నేతలు లెక్కచేయడం లేదు. దేశం మొత్తం ఆందోళనలు విస్తరిస్తున్నాయి. ఆందోళనల్లో పలువురు మృతి చెందారు. పలు ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇక పాక్ లోని పరిస్థితులపై అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పాక్ లో తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.