Janasena party latest news today(AP Political News): జనసేనానికో లెక్కుంది. సీఎం సీటుపై గురి ఉంది. పొత్తులపై పక్కా క్లారిటీ ఉంది. కాస్త తగ్గైనా.. ఈసారి పక్కాగా నెగ్గాలనే ఆలోచనలో ఉన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని మరోసారి తేల్చిచెప్పారు పవన్ కల్యాణ్.
పొత్తులకు సీఎం అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను సీఎం చేయమని టీడీపీనో, బీజేపీనో అడగనని.. కండీషన్లు పెట్టి అడగలేమని.. తన సత్తా ఏంటో చూపించే సీఎం పదవి అడుగుతానంటూ స్పష్టం చేశారు. సీఎం పదవి వరించి రావాలి కానీ.. కోరుకుంటే రాదని.. బలాన్ని బట్టే వస్తుందని అన్నారు.
గత ఎన్నికల్లో జనసేనకు 30 నుంచి 40 సీట్లు వచ్చుంటే.. కర్నాటకలో కుమారస్వామిలా తాను సీఎం స్థానంలో ఉండేవాడినన్నారు పవన్. ప్రస్తుతం తమకు పట్టున్న పలు స్థానాల్లో 30శాతం ఓటింగ్ ఉందని.. యావరేజ్గా స్టేట్ వైడ్ 18-19 శాతం ఓట్ షేరింగ్ ఉందని స్పష్టం చేశారు. కనీసం 30-40 స్థానాలుంటేనే సీఎం అభ్యర్థిగా ఉంటామని డిమాండ్ చేయగలమని.. జనసేన బలం మీదే ఆధారపడి సీట్ షేరింగ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. కొన్ని జిల్లాల్లో మా బలం ఎక్కువ.. కొన్ని జిల్లాల్లో తక్కువ.. జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ క్లారిటీగా చెప్పారు.
మా గౌరవానికి భంగం లేకుండా.. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పొత్తులు ఉంటాయని అన్నారు. ఇప్పటికే బీజేపీ, టీడీపీతో చర్చలు జరిపానని.. ఒకవేళ ఎవరైనా ఒప్పుకోకపోతే.. చర్చించి వారిని ఒప్పిస్తానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కూడా పొత్తులతోనే బలపడ్డాయని గుర్తు చేశారు. లెఫ్ట్ అండ్ రైట్ పార్టీలతో కలిసి వైసీపీపై పోరాటం చేయాలనే తనకుందని.. కానీ, ఎవరి సిద్ధాంతాలు వారికి ఉంటాయన్నారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని అంటున్నారని.. అందుకే జూన్ 3 నుంచి రాష్ట్రంలోనే ఉంటానని.. క్షేత్రస్థాయిలో తిరుగుతానని స్పష్టం చేశారు జనసేనాని.