Karnataka Elections(Latest Telugu News): కర్నాటక ఎన్నికలు. యావత్ దేశపు అటెన్షన్ డ్రా చేశాయి. దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అన్నిరాష్ట్రల ప్రజలు కన్నడ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ గెలుస్తుందా? బీజేపీ పవర్ నిలుపుకుంటుందా? జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందా? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
కర్నాటక ఎన్నికల ఫలితాలు.. అన్నిటికంటే తెలంగాణపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. అక్కడ కాంగ్రెస్ గెలిస్తే.. ఇక్కడి కాంగ్రెస్కి బిగ్ బూస్టే. అక్కడ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇక్కడి కమలనాథులను తట్టుకోవడం కష్టమే. అందుకే, కర్నాటకలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే టెన్షన్ అందరికంటే కేసీఆర్కే ఎక్కువ ఉంటుందని అంటున్నారు.
ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కే లీడ్ ఇచ్చాయి. హస్తం పార్టీ కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. ప్రస్తుత రాజకీయ క్లిష్ట పరిస్థితుల్లో ఆ విజయం వెయ్యేనుగుల బలంగా మారుతుంది. అదే స్పూర్తితో తెలంగాణ కాంగ్రెస్ సైతం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తుంది. అక్కడ అధికారపార్టీని గద్దె దించినట్టే.. కాస్త కష్టపడితే ఇక్కడా కేసీఆర్ సర్కారును పడగొట్టగలమనే ధీమా పెరుగుతుంది. కర్నాటకలో కాంగ్రెస్ అవలంభించిన గెలుపు వ్యూహాలను.. ఇక్కడా వర్కవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కర్నాటకలో ఇచ్చినట్టే ఉచిత హామీలు.. విస్తృత ప్రచార స్ట్రాటజీలను తెలంగాణలోనూ అమలు చేస్తారు. రాహుల్, ప్రియాంకలు తెలంగాణకు అదనపు సమయం కేటాయించొచ్చు. బీజేపీ సర్కారునే గద్దె దించాం.. కేసీఆర్ ఓ లెక్కా అనేలా మరింత దూకుడుగా దూసుకెళ్లొచ్చు కాంగ్రెస్.
ఒకవేళ కర్నాటక మళ్లీ బీజేపీ హస్తగతమైతే..? అబ్బో.. ఇక కమలనాథులను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాకపోవచ్చు. బొమ్మై పాలనపై పూర్తిగా వ్యతిరేకత ఉన్నా.. అవినీతి మరకలతో బద్నామ్ అయినా.. మళ్లీ కర్నాటకలో గెలవగలిగిందంటే.. ఇక బీజేపీ తెలంగాణను ఈజీ టార్గెట్గానే చూస్తుంది. కర్నాటకలో కాషాయ జెండా ఎగిరిందంటే.. అందుకు బీజేపీ ఎన్నికల వ్యూహాలు, మోదీ రోడ్ షోలు, జై బజరంగ్ భళీ నినాదామే కారణం అనడంలో సందేహమే ఉండదు. సేమ్ టు సేమ్.. తెలంగాణలోనూ ఎన్నికల సమయానికి ఇలానే రాజకీయ వాతావరణం అమాంతం మార్చేసే సత్తా ఆ పార్టీకి, ఆ పార్టీ నేతలకు సొంతం. కర్నాటక ఇచ్చిన కాన్ఫిడెన్స్తో కమలనాథులు తెలంగాణలో మరింత రెచ్చిపోవడం ఖాయం. ఇప్పటికే సమాధులు తవ్వుదామని, సచివాలయం డోములు కూలగొడతామని, పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని.. బండి సంజయ్ పొలిటికల్ బాంబులు పేలుస్తున్నారు. అది కర్నాటక మాదిరే ఓట్లు రాలుస్తాయని తేలితే.. ఆ పార్టీ నుంచి మరిన్ని క్షిపణుల్లాంటి స్టేట్మెంట్లు రావడం పక్కా. ఇప్పటికే తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టిన మోదీ, షా లు.. తెలంగాణ కోసం మరింత సమయం కేటాయించే అవకాశం ఉంది. కర్నాటకలో గెలిచినా.. ఓడినా.. తెలంగాణపై పట్టు మాత్రం వదలకపోవచ్చు కమలదళం.
అందుకే, కర్నాటకలో ఏ పార్టీ గెలిచినా.. గులాబీ బాస్కు టెన్షన్ తప్పకపోవచ్చని అంటున్నారు.