US Challenges Hackers:– సైబర్ సెక్యూరిటీ వింగ్ అనేది ఎంత బలంగా ఉంటుందో.. అంతకంటే ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తున్నారు హ్యాకర్లు. అందుకే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాలకు సంబంధించిన క్రిమినల్స్ను పోలిసులు సైతం తొందరగా పట్టుకోలేకపోతున్నారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ప్రజలు హ్యాకర్ల బారినపడక తప్పడం లేదు. అందుకే అమెరికా ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. హ్యాకర్లకు ఓపెన్ ఛాలెంజ్ విసిరింది.
ప్రస్తుతం చాట్జీపీటీ, చాట్బోట్, ఏఐ లాంటి టెక్నాలజీలు హ్యాకర్లకు అందకుండా తమ పనిని కొనసాగిస్తాయని నిపుణులు ఎప్పుడో చెప్పారు. అయితే ఈ టెక్నాలజీలను హ్యాక్ చేయడం, వీటిని తమ అవసరాల కోసం ఉపయోగించుకోవడం కష్టమైన విషయమని వారు తెలిపారు. ఒకవేళ చాట్జీపీటీ లాంటి టెక్నాలజీని హ్యాక్ చేయాలనుకున్నా దాని వెనుక పెద్ద ప్రక్రియే ఉంటుందన్నారు. అందుకే వైట్ హౌస్ హ్యాకర్లకు ఒక ఛాలెంజ్ విసిరింది. చాట్జీపీటీ, ఏఐ చాట్బోట్స్ వంటి టెక్నాలజీలను హ్యాక్ చేసి చూపించమని తెలిపింది.
ఈ ఛాలెంజ్లో పలువురు హ్యాకర్లు పాల్గొనున్నారు. లాస్ వేగస్లోని డెఫ్ కాన్ 31 హ్యాకర్ కన్వెన్షన్లో ఆగస్ట్లో ఈ ప్రోగ్రామ్ జరగనుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ లాంటి సంస్థలు కూడా ఈ ప్రోగ్రాంకు హాజరుకానున్నాయి. ఏఐ అనేది ప్రస్తుతం ఉన్న అన్ని టెక్నాలజీలలో మెరుగైనది. అయితే ఈ టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఎలా ఉపయోగించాలో తెలియాలంటే ముందుగా దానివల్ల కలిగే రిస్కులు ఏంటో కనిపెట్టాలి. ఇదే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని నిపుణులు చెప్తున్నారు.
ప్రస్తుతం ఏఐ డెవలప్మెంట్లో పాల్గొంటున్న టెక్ సంస్థలు ఆంథ్రోపిక్, గూగుల్, హగ్గింగ్ ఫేస్, మైక్రోసాఫ్ట్, న్విడియా, ఓపెన్ ఏఐ, స్టెబిలీటీ ఏఐ వంటి సంస్థలు ఈ ప్రోగ్రాంలో పాల్గొనున్నాయి. వైట్ హౌస్లో వైస్ ప్రెసిడెంట్, టెక్ నిపుణులకు మధ్య జరిగిన సమావేశంలో ఈ ప్రోగ్రాం గురించి నిర్ణయించారు. ఈ ప్రోగ్రాం అమెరికా ఏర్పాటు చేసిన ఏఐ బిల్ నియమాలను అనుసరిస్తూనే జరుగుతుందని అమెరికా మీడియా చెప్తోంది. ఈ ప్రోగ్రాం ద్వారా ఏఐకు సంబంధించిన వివరాలు మరిన్ని బయటికి వస్తాయని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.