Doctor news kerala(Latest News Updates Telugu): ఇది మరీ దారుణం. పాపం ఆ డాక్టర్. ఆమెకు అసలేం సంబంధంలేని విషయం. వైద్యురాలిగా తన పని తాను చేసుకుపోతోంది. కాలికి గాయంతో వచ్చిన పేషెంట్కు చికిత్స చేస్తోంది. ఆ పేషెంట్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉన్మాదిగా మారాడు. మద్యం మత్తులో చెలరేగిపోయాడు. చికిత్సకు ఉపయోగించే సర్జికల్ నైఫ్, సీజర్తో ఆ వైద్యురాలిని పొడిచి చంపాడు. నిందితుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో మరింత సంచలనంగా మారింది. ఇంతకీ అసలేం జరిగిందంటే…
గవర్నమెంట్ టీచర్ సందీప్.. తన ఫ్యామిలీతో ఏదో గొడవపడ్డాడు. పోలీసులకు ఫోన్ చేసి తనను కాపాడాలని కోరాడు. పోలీసులు అతని ఇంటికి వచ్చేసరికి కాలికి గాయంతో కనిపించాడు. ట్రీట్మెంట్ కోసం అతన్ని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు బయటే ఉండగా.. రూమ్లో డాక్టర్ వందనా దాస్(23) అతని గాయానికి చికిత్స చేస్తోంది. అంతలోనే నిందితుడు సందీప్.. సడెన్గా రెచ్చిపోయాడు. డాక్టర్ వందనాను కత్తెర, కత్తితో పొడిచాడు. ఆమె భయంతో కేకలు వేస్తూ గది నుంచి బయటకు పరుగెత్తుకు వచ్చింది. గది బయట ఉన్న పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులనూ గాయపడిచాడు సందీప్. ఎలోగోలా అతన్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలతో డాక్టర్ వందనా దాస్ చనిపోవడం కలకలం రేపింది.
ఘటనా సమయంలో నిందితుడు సందీప్ మద్యం మత్తులో ఉన్నాడని చెబుతున్నారు. డాక్టర్ హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేపట్టారు. నిందితుడైన ప్రభుత్వ టీచర్ సందీప్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేరళలోని కొల్లాం జిల్లా కొట్టరక్కరలో జరిగిందీ దారుణ ఉదంతం.