MahaRastra Politics News (Telugu Breaking News): మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. గోగ్వాలేను విప్ గా నియమించడం చెల్లదని తెలిపింది. రాజకీయ పార్టీల కలహాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడం తగదని సూచించింది. ఉద్దవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు కాబట్టి.. తిరిగి ఆయన్ను ముఖ్యమంత్రిగా నియమించలేమని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపైనా ఆదేశాలు ఇవ్వలేమని.. అనర్హత విషయం పూర్తిగా స్పీకర్ పరిధిలోని అంశమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. తాజా తీర్పుతో సీఎం షిండే పదవికి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు. ఠాక్రేకు పెద్దగా లాభం లేకపోవచ్చు.
అసలేం జరిగిందంటే..
2022 జూన్లో శివసేనకు చెందిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేకు మద్దతివ్వడం వల్ల ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 20న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, వారికి నేతృత్వం వహించిన ఏక్నాథ్ షిండే అనర్హత అంశాన్ని సత్వరమే తేల్చాలని ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తిరుగుబాటు నేత, ఆయన వర్గ ఎమ్మెల్యేల అనర్హత ప్రక్రియ డిప్యూటీ స్పీకర్ వద్ద పెండింగ్లో ఉండగానే షిండేతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన అప్పటి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నిర్ణయాన్ని కూడా ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రశ్నించింది. మరోవైపు.. ఫిరాయింపు ఆరోపణలతో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం తిరుగుబాటుదారులపై అప్పటి డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ షిండే వర్గం సుప్రీంను ఆశ్రయించింది.