Brahma Temple :- అందరి తలరాతలు రాసే బ్రహ్మదేవుడికి దేశంలో ఎక్కడా ఆలయాలు లేవు. ప్రపంచంలోని ఇతర దేశాలలో బ్రహ్మ గుడి కనిపించపోయినా గుంటూరు జిల్లా చేబ్రోలులో మాత్రం చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం ఉంది . రాష్ట్రంలోనే పురాతన ఆలయంగా ఇది రికార్డులకి ఎక్కింది. కోనేటిలో చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం ఉంది. అమరావతి ప్రాంతాన్ని ఏలిన రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు మాట తప్పి దొంగలకి శిక్ష విధించి తప్పు చేస్తాడు. అందుకు పరిహారంగా పండితుల సూచనల మేరకు బ్రహ్మదేవాలయం కట్టిస్తాడు. అన్నం మీద ఒట్టు వేసిన రాజు పరిహార్దం బ్రహ్మతో కలిపి శివుడిని ఒకేమూర్తిగా ఆలయాన్ని నిర్మిస్తారు.
బ్రహ్మదేవుడు కమలం నుంచి జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే బ్రహ్మను 4 ముఖాలతో శివలింగాకృతి వచ్చే విధంగా కోనేరులో ప్రతిష్టించారు. పురాణాల ప్రకారం బ్రహ్మను పూజించకూడదు. ఈశ్వరునికి అభిషేకం చేస్తే ఇండైరెక్టుగా బ్రహ్మకు చేరేలా చేరడం ఈ ఆలయం ప్రత్యేకత.
ఆగమ శాస్త్రం ప్రకారం శివాలయానికి ఎదురుగా, విష్ణుమూర్తి గుడికి వెనుక వైపు, అమ్మవారి గుడికి పక్కన ఏ నిర్మాణము చేయరాదు. బ్రహ్మ ఆలయం గురించి ఎలాంటి నియమాలు రూపొందించలేదు. ఆ విధంగా దోషం రాని విధంగా కోనేటి మధ్యలో బ్రహ్మరూపాన్ని నిర్మించారు.
ఏనుగుల మీద ఎర్రటి ఇసుకను తీసుకు వచ్చి ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. నిత్యం నీళ్లల్లో ఉన్నా కోనేరులో స్వామి వారి గుడి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఆంధ్రుల శిల్పకళా ప్రాభవాన్ని చాటేలా ఆలయ నిర్మాణం సాగింది. బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయసముదాయంలో రాజ్యలక్ష్మి అమ్మవారు వేణుగోపాల స్వామి, ఆంజనేయస్వామి, వీరభద్రుడు, నాగేశ్వరాలయాలు, ఒక నంది విగ్రహం పక్కపక్కనే ఉన్నాయి.