Inter Results: విధి ఆడిన వింత నాటకం.. ఆ కుటుంబంలో విషాధం నింపింది. మనోధైర్యం లేక ఆ ఇంటర్ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. ఇటీవల ఇంటర పరీక్షలు రాశాడు. బాగా రాయలేదని బాధపడ్డాడు. ఫెయిల్ అవుతానని భయపడ్డాడు. ఇక చదువు తనవల్ల కాదని.. తాను బతకలేనని.. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. చేతికి అందివస్తాడనుకున్న పిల్లాడు.. మార్కుల మాయలో పడి ప్రాణాలు తీసుకోవడం ఆ కుటుంబాన్ని దుఖ:సాగరంలో ముంచేసింది. ఆ బాధలో ఉండగానే.. మంగళవారం ఇంటర్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. చూస్తే.. ఆ చనిపోయిన స్టూడెంట్ ఏ1 గ్రేడ్లో పాస్ అయ్యాడు. బైపీసీలో వెయ్యికి 892 మార్కులతో మంచి స్కోర్ సాధించాడు. తాజా, ఫలితాలు ఆ ఫ్యామిలీని మరింత బాధకు గురి చేశాయి.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడగుట్ట తండాలో జరిగిందీ విషాధం. ఇంటర్ విద్యార్థి గుగులోతు కృష్ణ ఏప్రిల్ 10న ఆత్మహత్య చేసుకున్నాడు. బాగా చదవలేకపోయానని, పోటీలో వెనుకబడుతున్నానని లేఖరాసి ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇంటర్ రిజల్ట్స్లో వచ్చాక చూస్తే.. కృష్ణ మంచి మెరిట్ తెచ్చుకున్నాడని తెలిసి.. ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
‘కొడుకా.. లేనిపోని అనుమానంతో ఉరేసుకొని చనిపోతివి.. ఇప్పుడు ఇంటర్ పరీక్షల్లో గిన్ని మార్కులతో పాసయితివి’ అంటూ ఆ తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. పరీక్షా ఫలితాలు వచ్చే దాక కృష్ణ ఓపిక పట్టుంటే.. వాళ్లకి ఇంతటి కడుపుకోత ఉండేది కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.