Third Front: ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా బీహార్ CM నితీష్ కుమార్ ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో భువనేశ్వర్లోని ఆయన నివాసంలో నితీష్ భేటీ అయ్యారు. దేశ రాజకీయాలపై నేతలిద్దరూ చర్చించారు. ప్రతిపక్షాల కూటమిపై సాధ్యాసాధ్యాలపై సమాలోచనలు చేశారు.
బిజూ జనతాదళ్ అధ్యక్షుడిగా ఉన్న నవీన్, వివిధ పార్టీల నాయకులతో కలిసి NDAకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు. విపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు నితీశ్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే నవీన్తో నితీశ్ భేటీ అయ్యారు.
ఇంతకముందు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ నితీష్ భేటీ అయ్యారు. 2024 ఎన్నికలకు ముందు రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రతిపక్ష నేతలతో నితీశ్ గతంలో చర్చలు జరిపారు.
మరి, అందరితో భేటీ అవుతున్న సీఎం నితీష్.. సీఎం కేసీఆర్తో మాత్రం ఎందుకు దూరంగా ఉంటున్నారు? గతంలో గులాబీ బాస్ బీహార్ వెళ్లి మరీ నితీష్ ను కలిసి చర్చలు జరిపొచ్చారు. కేసీఆర్.. నితీష్ తో టచ్ లోకి వెళ్లినా.. ఆయన మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారా? ఇటీవల ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు నితీష్ కుమార్ రాకపోవడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. తనను పిలవలేదని.. పిలిచినా తాను రాకపోయేవాడినంటూ.. ఆ తర్వాత నితీష్ ఇచ్చిన స్టేట్ మెంట్ సైతం అంతే హాట్ టాపిక్ గా మారింది. బహుషా, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో జాతీయ దుకాణం పెట్టుకుని పీఎం సీటు కోసం సొంతంగా పాకులాడుతున్నారని కాబోలు.. గులాబీ బాస్ను వదిలేసి.. మిగతా పార్టీల బాస్లతో వరుస భేటీలు జరుపుతున్నారు నితీష్ కుమార్. కేజ్రీవాల్, నితీష్, మమతా, కేసీఆర్.. ఇలా అంతా ప్రధాని కేండిడేట్లే.. మరి, వారిమధ్య కూటమి సాధ్యమా? ఒకరికి ఒకరు సహకరించుకుంటారా? మోదీని కొట్టడం అంత ఈజీనా?