Muthireddy Yadagiri Reddy : బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రస్. నోటి దురుసుతో నిత్యం వార్తల్లో ఉంటారు. భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. ఆయన తాజాగా అలాంటి మరో వివాదంలో చిక్కుకున్నారు. సొంత కుమార్తే ఆయనపై కేసు పెట్టడం సంచలనం సృష్టిస్తోంది.
నాచారంలో తన పేరిట ఉన్న 159 గజాల కమర్షియల్ బిల్డింగ్ను ఫోర్జరీ సంతకంతో కినారా గ్రాండ్కు అక్రమంగా లీజ్ అగ్రిమెంట్ చేయించారని ముత్తిరెడ్డి కూతురు తూల్జా భవానీరెడ్డి ఉప్పల్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేపై చీటింగ్, సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 406, 420, 463,464,468, 471, R/w 34ipc,156 (3) crpc కింద కేసులు నమోదు చేశారు.
తనపై కేసు నమోదుపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పందించారు. తన కూతురు సంతకాన్ని తాను ఫోర్జరీ చేయలేదని స్పష్టంచేశారు. ఆ ఫ్లాట్ ఆమె పేరుతోనే ఉందన్నారు. చేర్యాలలో సర్వే నెం 1402లో 1200 గజాల భూమి తన బిడ్డ పేరు మీదే రిజిస్టర్ చేసి ఉందని తెలిపారు. ఉప్పల్ పీఎస్ పరిధిలో తుల్జా భవాని పేరుపై 150 గజాల స్థలం ఉందన్నారు. అయితే దీనిని తన కుమారుడు కిరాయికి ఇచ్చారని అది కూడా తనకు తెలియకుండానే జరిగిందన్నారు. ఎలాంటి ప్రాపర్టీ బదలాయింపు జరగలేదని వివరించారు. ఆ కిరాయి కూడా ఆమెకే వెళ్తుందని తెలిపారు. ఇది కుటుంబ సమస్య అని కానీ రాజకీయంగా గిట్టనివారు వివాదంగా మార్చారని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆరోపించారు. ఒకవేళ తాను తప్పు చేస్తే ప్రజలు శిక్ష వేస్తారన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు నియోజకవర్గంలో ఉంటానన్నారు.
ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై అనేక ఆరోపణలున్నాయి. యశ్వంతపూర్లో బతుకమ్మ కుంట 6 ఎకరాల భూమిని ఆక్రమించారని గతంలో మాజీ సర్పంచ్ హైకోర్టుకు వెళ్లారు. బతుకమ్మ కుంట భూఆక్రమణపై అప్పటి కలెక్టర్ దేవసేనతో ముత్తిరెడ్డికి గొడవ జరిగింది. నర్మెట్ట మండలం హన్మంతపూర్ శివారులో ప్రభుత్వ భూమి 70 ఎకరాలు కబ్జా చేశారని ఆరోపణలున్నాయి. చేర్యాల మండల కేంద్రంలోని అంగడి స్థలం ఎకరం 20 గుంటలు ఆక్రమించి ప్రహరీ నిర్మించారని విమర్శలు వచ్చాయి. గొల్లకురుమలు జీవనోపాధి కోసం కొనుగోలు చేసిన భూమిని సైతం ఎమ్మెల్యే ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.