Tirumala : భద్రతా వైఫల్యం. తిరుమలలో తరచూ వినిపిస్తున్న మాట ఇది. కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి రోజూ వేల మంది వస్తుంటారు. భక్తులందర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తారు. నిషేధిత వస్తువులను లోనికి అనుమతించరు. ఇలా పటిష్ట నిఘాను తిరుమలలో ఏర్పాటు చేశారు.
తిరుమలలో భద్రత విజిలెన్స్ వింగ్ పర్యవేక్షణలో ఉంటుంది. ఘాట్ రోడ్డులో వాహనాల్లో వచ్చే ప్రయాణికులను కింద దించ క్షణ్ణంగా పరిశీలించిన తర్వాత కొండపైకి అనుమతిస్తారు. తిరుమల కొండపైకి వెళ్లేవారిని సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద తనిఖీ చేస్తారు. భక్తులు క్యూలైన్లలో ప్రవేశించే సమయంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. అక్కడ కళ్లు గప్పి భక్తులు నిషేధిత వస్తువులను లోనికి తీసుకెళ్లినా.. టిక్కెట్ల స్కానింగ్ దగ్గర చెక్ పాయింట్ ఉంటుంది. ఆ తర్వాత మరో చెక్ పాయింట్ లోనూ తనిఖీలు జరుగుతాయి. ఇలా ఎంతో పటిష్ట భద్రత ఉన్నా తిరుమలలో తరచూ భద్రతా వైఫల్యం అనే మాట వినిపిస్తోంది.
తిరుమలలో తాజాగా ఆనంద నిలయం దృశ్యాలను వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే సమయంలోనే మూడు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తారు. శ్రీవారి ఆనందనిలయ దృశ్యాలను ఓ వ్యక్తి చిత్రీకరించడం టీటీడీ నిఘా వైఫల్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆనంద నిలయం వీడియోపై విజిలెన్స్ అధికారి బాలిరెడ్డి స్పందించారు. సీపీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. మహిళా భక్తురాలు ఆలయ దృశ్యాలను చిత్రీకరించినట్టు గుర్తించారు. మొబైల్ తో కాకుండా సీక్రెట్ కెమెరాతో ఈ దృశ్యాలు చిత్రీకరించినట్టు తెలుస్తోంది.ఆ మహిళా భక్తురాలి వివరాలు విజిలెన్స్ అధికారులు సేకరిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.