Yashasvi Jaiswal:- టీమిండియాకు మరో మెరుపుతీగ దొరికినట్టే. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. కేవలం ఆడడం కాదు… ఐపీఎల్లో రికార్డులు సృష్టిస్తున్నాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా సెంచరీ బాదాడు. 53 బంతుల్లోనే 8 సిక్సులు, 15 ఫోర్లు కొట్టి సెంచరీ చేసి… అక్కడితో ఆగకుండా 62 బంతుల్లో 124 పరుగులు చేశాడు. యశస్వి జైశ్వాల్ ఆటను గ్రౌండ్లో ఉండి ప్రత్యక్షంగా చూసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మా ఫిదా అయ్యాడు. టీమిండియాలోకి రావడానికి యశస్వి జైశ్వాల్కు అన్ని అర్హతలు ఉన్నాయని ఆనాడే కొనియాడాడు. రెండేళ్లుగా ఐపీఎల్లో యశస్వి జైశ్వాల్ పర్ఫామెన్స్ చూస్తున్నానని, రోజురోజుకు రాటుదేలుతున్నాడని చెప్పుకొచ్చాడు.
తాజాగా యశస్వి జైశ్వాల్ సరికొత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో వెయ్యి పరుగులు చేసిన రెండో అతి చిన్న వయసున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు యశస్వి జైశ్వాల్. 21 ఏళ్ల 130 రోజుల యశస్వి జైశ్వాల్.. 34 ఇన్నింగ్సులలోనే ఈ ఫీట్ సాధించాడు. జైశ్వాల్ కంటే ముందు ఈ రికార్డ్ రిషబ్ పంత్ ఖాతాలో ఉంది. 20 ఏళ్ల 218 రోజులప్పుడే.. 35 ఇన్నింగ్స్ల్లో వెయ్యి పరుగులు మార్క్ అందుకుని తొలి స్థానంలో నిలిచాడు రిషబ్ పంత్. పృథ్వీ షా 21 ఏళ్ల 169 రోజులప్పుడు 44 ఇన్నింగ్స్ల్లో, సంజూ శాంసన్ 21 ఏళ్ల 183 రోజులప్పుడు 44 ఇన్నింగ్స్ల్లో, శుబ్మన్ గిల్ 21 ఏళ్ల 222 రోజులప్పుడు 41 ఇన్నింగ్స్ల్లో, దేవదత్ పడిక్కల్ 21 ఏళ్ల 285 రోజులప్పుడు 35 ఇన్నింగ్స్ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నారు.
ప్రస్తుతం యశస్వి జైశ్వాల్ ఆట చూసి.. బీసీసీఐ పెద్దలు కూడా ఫిదా అవుతున్నారు. ఆల్రడీ టీమిండియా వన్డే జట్టులోనే రెండు టీమ్స్ ఉన్నాయి. టీ-20లు, టెస్టులకు స్పెషల్ బ్యాట్స్మెన్ ఉన్నారు. అయినా సరే… గాయాల కారణంగా కొత్త టాలెంట్ అవసరం ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యశస్వి జైశ్వాల్కు అవకాశం ఇవ్వాలనుకుంటోంది బీసీసీఐ.