Kerala : కేరళలోని మలప్పురం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చేరింది. ఒకే కుటుంబానికి చెందినవారు 11 మంది మృతిచెందారని తెలుస్తోంది. తనూర్ ప్రాంతంలోని తువల్తీరం బీచ్ సమీపంలో ఆదివారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో హౌస్బోట్ బోల్తాపడింది. టికెట్ల ఆధారంగా ప్రమాద సమయంలో 30 మంది బోటులో ఉన్నారని అంచనా వేశారు. కానీ చాలా మంది టికెట్ లేకుండానే బోటు ఎక్కారని స్థానికులు అంటున్నారు. అందువల్లే ఎంతమంది బోటులో ఉన్నారనే విషయంపై స్పష్టత రాలేదు.
ఇప్పటివరకు 22 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మరో 8 మందిని కాపాడి ఆసుపత్రులకు తరలించారు. గల్లంతైన వారి కోసం NDRF, భారత కోస్ట్గార్డ్ సిబ్బంది గాలిస్తున్నారు. అండర్వాటర్ కెమెరాల సాయంతో అన్వేషిస్తున్నారు. బోటుప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేరళ మీడియాలో కథనాలు వచ్చాయి.
బోటు బోల్తా పడటానికి స్పష్టమైన కారణాలు వెల్లడికాలేదు. నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఎమ్మెల్యే పీకే కున్హళికుట్టి ఆరోపించారు. ప్రమాదానికి గురైన హౌస్బోట్కు సేఫ్టీ సర్టిఫికేట్ లేదని స్పష్టంచేశారు. సామర్థ్యాన్ని మించి ప్రయాణికులను ఎక్కించుకున్నారని ఆరోపించారు. సాయంత్రం 6 గంటల తర్వాత హౌస్బోట్స్ రైడ్స్కు పర్మిషన్ లేదన్నారు.
బోటు ప్రమాదంపై కేరళ సీఎం పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. కేరళ వ్యాప్తంగా సోమవారం సంతాపదినం ప్రకటించారు. అధికారిక కార్యక్రమాలను రద్దు చేశారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు.