Twitter Employees : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతుల్లోకి ట్విట్టర్ వెళ్తే 75 శాతం మంది ఉద్యోగులపై వేటు పడుతుందనే వార్తలు బయటికి రావడంతో… ట్విట్టర్ ఎంప్లాయిస్ స్పందించారు. ఏకంగా మస్క్ కే వార్నింగ్ ఇస్తూ బహిరంగ లేఖ రాశారు. మస్క్ నిర్ణయం అనాలోచితమైనది, నిర్లక్ష్యమైనదిగా అభివర్ణించిన ట్విట్టర్ ఉద్యోగులు… యూజర్లను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తమ ప్లాట్ఫామ్పై యూజర్లు పెట్టుకున్న నమ్మకం కూడా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వేధింపులు, బెదిరింపులు ఎదురయ్యే వాతావరణంలో తాము పని చేయలేమంటూ లేఖలో స్పష్టంగా చెప్పారు… ట్విట్టర్ ఉద్యోగులు.
అంతేకాదు… లేఖలో పలు డిమాండ్లను ప్రస్తావించారు… ట్విట్టర్ ఎంప్లాయిస్. వర్క్ ఫ్రమ్ హోం కొనసాగించడంతో పాటు ఉద్యోగులకు ఇతర ప్రయోజనాల్ని కొనసాగించాలని కోరారు. సిద్ధాంత పరంగా మస్క్కు, ట్విట్టర్కు మధ్య చాలా అంతరం ఉందని… జాతి, లింగం, వైకల్యం, రాజకీయ విశ్వాసాల ఆధారంగా ఉద్యోగులపై వివక్ష చూపొద్దని లేఖలో స్పష్టంగా చెప్పారు… ట్విట్టర్ ఉద్యోగులు.
మరోవైపు… ట్విట్టర్ డీల్ ముంగింపుకు గడువు దగ్గరపడుతోంది. అక్టోబర్ 28 సాయంత్రం 5 గంటల లోపు ట్విట్టర్ డీల్ పూర్తి కావాలని… లేదంటే మళ్లీ విచారణ ప్రారంభిస్తామని… డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీ డెడ్లైన్ విధించింది. డీల్ పూర్తి కావడానికి ఇక మూడు రోజులే గడువు ఉండటం… 75 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించాలని మస్క్ భావిస్తున్నట్లు వార్తలు రావడంతో… జాబ్స్ ప్రమాదంలో పడకముందే మస్క్ ను హెచ్చరిస్తూ లేఖ విడుదల చేశారు… ట్విట్టర్ ఉద్యోగులు.
ఇక… ట్విట్టర్ ఉద్యోగుల్ని తీసేస్తే మస్క్కు నష్టం తప్ప లాభం లేదని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. కంపెనీ ఎవరి చేతుల్లో ఉన్నా భవిష్యత్ లో ఉద్యోగాల కోత తప్పదని హెచ్చరించింది. ఉద్యోగుల మాస్ లే ఆఫ్స్ కారణంగా ట్విట్టర్ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని… హానికరమైన కంటెంట్ను నియంత్రించే సామర్థ్యం, భద్రతా సమస్యలను ఎదుర్కోవడంలో ఇబ్బందులు తప్పవని వాషింగ్టన్ పోస్ట్ అభిప్రాయపడింది.