Stock Markets : దీపావళి రోజున ముహూరత్ ట్రేడింగ్ లో దాదాపు ఒక శాతం మేర పెరిగిన భారత స్టాక్ మార్కెట్లు… మర్నాడు నష్టాలతో ముగిశాయి. ముహూరత్ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 525 పాయింట్లు, నిఫ్టీ 155 పాయింట్లు పెరగడంతో… వరుసగా ఏడు సెషన్ల పాటు మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. దాంతో మార్కెట్లలో మంగళవారం లాభాల స్వీకరణ జరిగింది. దేశీయ మదుపరులతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు సెల్లింగ్ కే మొగ్గుచూపడం, రూపాయి విలువ పతనం, మళ్లీ ముడిచమురు ధరలు పెరుగుతుండటం వంటి కారణాలతో… సూచీలు రెండూ నష్టపోయాయి.
మంగళవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమయ్యాక… దాదాపు గంటసేపు సూచీలు లాభనష్టాల్లో ఊగిసలాడాయి. తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో… నష్టాల్లోకి జారుకున్నాయి. 60,002 పాయింట్ల దగ్గర మొదలైన సెన్సెక్స్… ఇంట్రాడేలో 60,081 నుంచి 59,489 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరకు 288 పాయింట్లు నష్టపోయి 59,544 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 17,656 పాయింట్ల దగ్గర క్లోజైంది. సెన్సెక్స్30 సూచీలో 11 షేర్లు లాభపడ్డగా… 19 షేర్లు నష్టాల్లో ముగిశాయి. లాభపడ్డ కంపెనీల్లో టెక్ మహీంద్రా, మారుతీ, ఎల్అండ్టీ, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, సన్ఫార్మా, టీసీఎస్ ఉన్నాయి. ఇక నెస్లే ఇండియా, హెచ్యూఎల్, బజాజ్ ఫిన్సర్వ్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టైటన్ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి.
ఇక రూపాయితో డాలర్ మారకం విలువ 7 పైసలు బలపడింది. ఇంటర్బ్యాంక్ విదేశీ మారకపు మార్కెట్లో 82.71 వద్ద ప్రారంభమైన రూపాయి మారకం ధర… 82.62 – 82.81 మధ్య ఊగిసలాడింది. చివరికి 7 పైసలు పెరిగి 82.81 వద్ద స్థిరపడింది.