IPL : అన్నదమ్ముల సవాల్ లో తమ్ముడే గెలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించింది. హార్ధిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు శుభమన్ గిల్ (94 నాటౌట్), వృద్ధిమాన్ సాహా (81) తొలి వికెట్ కు 142 పరుగులు జోడించారు. ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా (25), డేవిడ్ మిల్లర్ (21 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 227 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో మెహ్ సిన్ ఖాన్, అవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. మిగతా బౌలర్లు ఎవరూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. మొత్తం 8 మంది బౌలింగ్ కు దిగినా రెండు వికెట్లు మాత్రమే పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఓపెనర్లు మేయర్స్ ( 48) , డికాక్ (70) మంచి ఆరంభాన్నే అందించారు. తొలివికెట్ కు 88 పరుగులు జోడించారు. ఆ తర్వాత మరో బ్యాటర్ కనీసం 30 పరుగులు కూడా చేయలేదు. పూరన్ (3), స్టొయినిస్ (4) విఫలం కావడంతో లక్నో లక్ష్యాన్ని చేధించలేకపోయింది. 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేసింది. దీంతో గుజరాత్ 56 పరుగుల తేడాతో గెలిచింది.
గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు. షమీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. రాహుల్ గాయపడటంతో లక్నో జట్టుకు కృనాల్ పాండ్యా నాయకత్వం వహించాడు. ఇప్పటికే గుజరాత్ కెప్టెన్ గా హార్ధిక్ ఉన్నాడు. దీంతో అన్నదమ్ముల పోరుపై సర్వత్రా ఆసక్తి రేగింది. చివరికి తమ్ముడి జట్టునే విజయం వరించింది.