Samsung Bans Employees:- అసలు మనిషి మేధస్సే ఇంత వేగంగా పరిగెడుతుంటే కృత్రిమ మేధస్సు అవసరం మనుషులకు ఎప్పటికైనా ఉంటుంది అనే ఆలోచన టెక్ శాస్త్రవేత్తలకు ఎందుకు వచ్చిందో ఏమో.. వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ను తయారు చేసే పనిలో పడ్డారు. అందులో ముందుగా ఏఐ పరిశోధనల్లో కీలక భాగంగా ఉండి, దానిని ప్రపంచానికి పనిచేసిన వ్యక్తి డా. జెఫ్రే హింటన్ గూగుల్ నుండి తప్పుకోవడం ఒక్కసారిగా అందరినీ షాక్కు గురిచేసింది. ఇప్పుడు దాని ప్రభావం ఇతర టెక్ సంస్థలపై పడుతోంది.
డా. జెఫ్రే హింటన్ను తోటి టెక్ దిగ్గజాలు ‘గాడ్ఫాదర్ ఆఫ్ ఏఐ’ అని ప్రేమగా పిలుచుకునేవారు. అలాంటి వ్యక్తి టెక్నాలజీలో పెరుగుతున్న వేగాన్ని చూసి గూగుల్ నుండి తప్పుకోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసినా.. కొందరినీ మాత్రం కలవరపెట్టింది. ఇప్పటికే ఎంతోమంది నిపుణులు టెక్నాలజీ వల్ల హాని ముంచుకొస్తుందని, అది మనుషులకు అర్థం కావడం లేదని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు హింటన్ తీసుకున్న ఈ నిర్ణయం కూడా వారి అభిప్రాయాలకు తోడుగా నిలబడుతోంది. దీంతో కొందరు హింటన్ తయారు చేసిన టెక్నాలజీలకు ముందుగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
హింటన్ తప్పుకోవడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు ఏఐను విమర్శించే లిస్ట్లో చేరాయి. అందులో సామ్సంగ్ కూడా చేరింది. అంతే కాకుండా ఈ విషయంలో సామ్సంగ్ ఒక సంచలన నిర్ణయమే తీసుకుంది. జెనరేటివ్ ఏఐ, చాట్జీపీటీ, గూగుల్ బ్రాడ్ వంటి టెక్నాలజీలను ఉద్యోగులు ఉపయోగించకూడదని రూల్ పెట్టింది. ఉపయోగిస్తున్న వారిపై బ్యాన్ను ప్రకటించింది. అయితే సామ్సంగ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి దాని వెనుక ఒక భిన్నమైన కారణం ఉందని టెక్ ప్రపంచం కోడై కూస్తోంది.
చాట్జీపీటీ ఉపయోగిస్తున్న సామ్సంగ్ ఉద్యోగులు.. కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని చాట్జీపీటీతో షేర్ చేసుకున్నారని, దీని వల్ల సమాచారం బయటికి వెళ్లిందని టెక్ వరల్డ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల వల్ల సమాచారం లీక్ అవ్వడం వల్ల సామ్సంగ్ యాజమాన్యం వారిపై ఆగ్రహంతో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం చాట్జీపీటీకి వెళ్లిన సమాచారం.. ఇతర చాట్బోట్ యూజర్లకు చేరుతుందేమో అని భయపడుతోంది. సామ్సంగ్ ఎదుర్కొన్న ఎదురుదెబ్బ చూసి ఇతర టెక్ సంస్థలు సైతం అలర్ట్ అయ్యాయి.