Modi : కర్నాటకలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రచారానికి మరో రోజు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. తాజాగా బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో చేపట్టారు. న్యూ తిప్పసాంద్ర రోడ్డులోని కెంపెగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్ వరకు ఈ రోడ్ షో చేపట్టారు.
ప్రధాని చేపట్టిన రెండో రోడ్ షో ఇది. మోదీపై దారి పొడవునా పూల వర్షం కురిపించారు. నీట్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా రెండో రోడ్ షోను 10 కిలోమీటర్లతో సరిపెట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. దక్షిణ కర్ణాటకలో కేంద్రం హోంమంత్రి అమిత్ షా రోడ్ షో చేపట్టారు.
ప్రధాని శనివారం 28 కిలోమీటర్లు రోడ్ షో చేశారు. 18 నియోజకవర్గాలను చుట్టేశారు. బాదామి, హావేరిలకు వెళ్లిన మోదీ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఉన్న బిడ్డ ప్రపంచమే గుర్తించేలా దేశాన్ని నిలబెట్టారంటే అందుకు కారణం తాను కాదని ప్రజలు వేసిన ఓటేనని ప్రకటించారు.
కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. సోమవారంతో ప్రచార పర్వం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. అటు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.