Kashmir: జమ్మూకశ్మీర్ రాజౌరి ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. రాజౌరీలో శుక్రవారం నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్కు ఆపరేషన్ త్రినేత్రగా భద్రత బలగాలు నామకరణం చేశాయి. ఇప్పటి వరకూ ఒక ఉగ్రవాది హతం కాగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయినట్టు ఆర్మీ వెల్లడించారు.
బారాముల్లా జిల్లాలోని కుంజర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే నిఘావర్గాల సమాచారం మేరకు స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు శనివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు భద్రతా బృందాలపై కాల్పులు జరిపారు. ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
ఉగ్రమూక నుంచి ఒక ఏకే 56, 4 మాగ్జిన్లు, 56 రౌండ్ల ఏకే 56 బుల్లెట్లు, 9ఎంఎం పిస్టల్, మాగ్జిన్, 3 గ్రెనేడ్లు, ఇతర మందుగుండు సామాగ్రి.. ఇవన్నీ ధరించేందుకు ఉపయోగించిన జాకెట్ను స్వాధీనం చేసుకున్నారు. హతమైన ఉగ్రవాది లష్కరే తోయిబాకు చెందిన వాడుగా భావిస్తున్నారు. కాగా, బారాముల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో ఇది మూడో ఎన్కౌంటర్. ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను వేర్వేరు ఎన్కౌంటర్లలో హతమార్చారు.
అటు, జమ్ము కశ్మీర్ లో పర్యటించిన రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కాల్పులపై ఆర్మీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడితో రాజౌరిలో ఐదుగురు జవాన్ల ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై కేంద్రమంత్రి సమీక్షిస్తున్నారు.
జీ20 సమావేశాల్లో భాగంగా ఈ నెల 22న శ్రీనగర్లో టూరిజంపై వర్కింగ్ గ్రూప్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు దాడులు జరుగుతున్నాయని సైనిక అధికారులు భావిస్తున్నారు. జమ్మూకశ్మీర్ లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నిఘా పెట్టి తనిఖీలు చేస్తున్నారు.