Helicopter: భారత సైన్యానికి చెందిన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్ రెండు రోజుల క్రితం జమ్మూకశ్మీర్లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ సాంకేతిక నిపుణుడు దుర్మరణం చెందాడు. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఆర్మీ.. ధ్రువ్ హెలికాప్టర్ల వినియోగాన్ని మరోసారి నిలిపివేసింది. ఈ మేరకు మిలిటరీ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ చాపర్ల వినియోగాన్ని నిలిపివేయడం రెండు నెలల్లో ఇది రెండోసారి.
ఈ ఏడాది మార్చి 8న మన నౌకాదళానికి చెందిన ఏఎల్హెచ్ ధ్రువ్ .. ముంబయి తీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని ముగ్గురు సిబ్బందిని నేవీ పెట్రోలింగ్ ఎయిర్క్రాఫ్ట్ సాయంతో రక్షించారు. ఈ ఘటన తర్వాత ధ్రువ్ హెలికాప్టర్ల వినియోగాన్ని త్రివిధ దళాల్లో నిలిపివేశారు. అయితే గత సోమవారం నుంచే సైన్యం వీటి సేవలను పునరుద్ధరించగా.. గురువారం ఓ ధ్రువ్ హెలికాప్టర్ కూలిపోయింది.
సాంకేతిక లోపం తలెత్తడంతో జమ్మూకశ్మీర్లోని కిశ్త్వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తుండగా ఈ చాపర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన సాంకేతిక నిపుణుడు పబ్బల్ల అనిల్ మృతి చెందగా, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఆర్మీ.. ముందు జాగ్రత్త చర్యగా ధ్రువ్ చాపర్ల వినియోగాన్ని నిలిపివేసినట్లు మిలిటరీ వర్గాలు తెలిపాయి. నేవీ, కోస్ట్గార్డ్లోని ధ్రువ్ హెలికాప్టర్లకు సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు, జమ్మూ కశ్మీర్లో హెలికాప్టర్ కూలిన ఘటనలో మరణించిన తెలంగాణకు చెందిన జవాన్ పబ్బాల అనిల్ అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపుర్ లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, శ్రేయోభిలాషులు అనిల్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. జై జవాన్ నినాదాలతో మల్కాపూర్ మార్మోగిపోయింది. అనిల్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమర జవాన్ అనిల్ పార్థివదేహానికి మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ నివాళులర్పించారు.