Kedarnath: కేదార్నాథ్లో తెలుగువారికి తృటిలో ప్రమాదం తప్పింది. భారీగా మంచువర్షం కురవడంతో భక్తులపై మంచుచరియలు విరిగిపడ్డాయి. వెంటనే మంచు కింది నుంచి భక్తుల్ని బయటికి లాగారు తోటి భక్తులు. అందరికీ ప్రాణాపాయం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు.
గత నెల 23న విజయవాడ నుంచి తీర్థయాత్రలకు 150 మంది భక్తులు వెళ్లారు. గంగోత్రి, యమునోత్రి తర్వాత కేదార్నాథ్ లో శివ దర్శనం కోసం వెళ్లారు. ఐతే.. మంగళవారం మధ్యాహ్నం నుంచి కేదార్నాథ్లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. కొండలపై భారీగా మంచు పేరుకుపోయింది. అది కాస్తా.. రోడ్డుపై వెళ్తున్న భక్తుల మీద ఒక్కసారిన పడింది. భారీ హిమపాతం నేపథ్యంలో అధికారులు ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ప్రస్తుతం ఇక్కడ ఎడతెరిపి లేని హిమపాతం కురుస్తుంది. దీంతో చార్ ధామ్ యాత్రలో భాగంగా ఇటీవల తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయం మళ్లీ మూత పడింది. అంతేకాదు భారీగా మంచు కురియడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
కేదార్నాథ్లో కురుస్తున్న హిమపాతం వల్ల ఆక్సీజన్ లెవెల్స్ పడిపోయాయని అధికారులు తెలిపారు. వయసు పైబడిన యాత్రికులు కొందరు ఊపిరి అందక చాలా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. దీంతో యాత్రికులు తమ బస ప్రాంతానికి పరిమితం అయ్యారు.
ఈ సందర్భంగా కేదార్నాథ్ యాత్రకు తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లు నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి బద్రినాథ్, గంగోత్రి, యమునోత్రిలకు రిజిస్ట్రేషన్లు నడుస్తున్నాయని అన్నారు. వాతావరణ పరిస్థితులు చక్కబడ్డ తర్వాత యాత్ర కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
వయసు మీదపడినవారు.. గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు అధికారులు. మరో రెండు మూడు రోజుల వరకు హిమపాతం కొనసాగే అవకాశం ఉందని రుద్రప్రయాగ్ కలెక్టర్ తెలిపారు.
ఆలయ పరిసర ప్రాంతంల్లో ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురుస్తుంది.. ఏ క్షణంలో వాతావరణం ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో అడుగు తీసి అడుగు వేయలని పరిస్థితి ఉంది. కేదార్నాథ్లో చిక్కుకున్న యాత్రికులను గుర్రాలపై కిందకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. మొత్తానికి చార్ ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.