Neera Cafe : నీరా కేఫ్ హైదరాబాద్ లో అందుబాటులోకి రానుంది. కల్లుకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నీరా కేఫ్ ను ఏర్పాటు చేసింది. రూ. 20 కోట్ల వ్యయంతో హుస్సేన్ సాగర్ తీరంలో నెక్లెస్రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద నీరా కేఫ్ నిర్మించింది. నీరాను ఆస్వాదించేందుకు తరలివచ్చే జనాల కోసం ప్రభుత్వం అన్ని వసతులు కల్పించింది.
నెక్లెస్ రోడ్డులో 2020 జులై 23న నీరా కేఫ్కు శంకుస్థాపన చేశారు. ఈ కేఫ్ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. కేఫ్లో 7 స్టాళ్లు ఉంటాయి. 500 మంది కూర్చునే సౌకర్యం ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో నీరాను అమ్ముతారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఫుడ్ కోర్టు ఉంటుంది. ఇక్కడ వివిధ రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి.
నీరాను అక్కడే కూర్చుని తాగవచ్చు. లేదంటే పార్మిల్ తీసుకుని వెళ్లవచ్చు. పల్లె వాతావరణం అనుభూతి కలిగేలా కేఫ్ చుట్టూ తాటి చెట్ల ఆకృతులు, పైకప్పును తాటాకు ఆకృతిలో రూపొందించారు. నీరా కేఫ్ నుంచి ట్యాంక్బండ్లోని బుద్ధ విగ్రహం వరకు బోటింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు.
హైదరాబాద్ శివారు నందన వనంలోని పదెకరాల్లో ఉన్న తాటి చెట్ల నుంచి నీరా సేకరిస్తారు. నీరా నాలుగు డిగ్రీల ఉష్టోగ్రత వద్ద సురక్షితంగా నిల్వ ఉంటుంది. తాటి, ఈత నీరా సేకరించాక దాన్ని సీసాల్లో పోసి.. ఐస్ బాక్సుల్లో నగరానికి తీసుకొస్తారు. నీరా కేఫ్లో శుద్ధి చేసి.. ప్యాకింగ్ చేసి.. విక్రయిస్తారు.