Bridge : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బాహుదా నదిపై ఉన్న పురాతన వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. గ్రానైట్ రాళ్ల లోడుతో లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాలోని అస్కా నుంచి ఒంగోలుకు 70 టన్నుల గ్రానైట్ రాళ్ల లోడుతో లారీ వెళుతోంది. సాధారణంగా భారీ బరువుతో వచ్చే వాహనాలు పక్కనే ఉన్న జాతీయ రహదారి పైనుంచి వెళ్తుంటాయి. కానీ గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ మాత్రం ఇచ్ఛాపురం మీదుగా వచ్చింది.
వంతెనపైకి లారీ చేరుకోగానే ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో లారీ కిందికి నదిలోకి జారిపోయింది. నదిలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదే విధంగా ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపైకి ఇతర వాహనాలు రాలేదు. దీంతో ప్రాణనష్టం జరగలేదు.
బహుదానదిపై బ్రిడ్జి కూలిపోవడంతో నేరుగా ఇచ్ఛాపురంలోకి వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయంగా పోలీసులు జాతీయ రహదారి వైపు నుంచి బస్సులు, ఇతర వాహనాలను మళ్లిస్తున్నారు.
బాహుదా నదిపై ఈ వంతెనను 1929లో బ్రిటీష్ పాలకులు నిర్మించారు. చాలాకాలంగా బ్రిడ్జి బలహీనంగా మారింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.