KCR : నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. 3 రోజులపాటు హస్తినలోనే ఉంటారు. ఢిల్లీ వసంత్ విహార్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. కేసీఆర్ గురువారం ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ ను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్ మంగళవారం సందర్శించారు. కార్యాలయ ప్రారంభోత్సవం వేళ నిర్వహించే యాగం, హోమం, ఇతర పూజా కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు.
బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీసు ఫ్రంట్ వ్యూను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. పార్టీ అధినేత కేసీఆర్ 14 ఫీట్ల కటౌట్ బోర్డు ఫొటో, తెలంగాణ మ్యాప్, తెలంగాణ తల్లి విగ్రహం, కాకతీయ కళాతోరణం, పార్టీ గుర్తు ప్రత్యేక ఆక్షరణగా నిలువనున్నాయి. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించారు. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో మీడియా హాల్, పర్మినెంట్ క్వార్టర్స్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 జనరల్ సెక్రటరీ రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో ప్రెసిడెంట్ చాంబర్, పేషీ, సీఎం కాన్ఫరెన్స్ హాల్ , సెకండ్, థర్డ్ ఫ్లోర్లో ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం 2 సూట్లు, పార్టీ ముఖ్యనేతల కోసం 18 రూమ్స్ ఉన్నాయి.
నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ముందే ఈ కార్యాలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దక్షిణాది రాజకీయ పార్టీల్లో అన్నాడీఎంకే తర్వాత ఢిల్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న రెండో జాతీయ పార్టీగా బీఆర్ఎస్ రికార్డు సృష్టించింది. కేసీఆర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో, మరికొందరు జాతీయ నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. శుక్రవారం మళ్లీ తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు.