AP Political News(Balineni Srinivasa Reddy News): మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో కీలక నేత. జగన్ కేబినెట్ 1.0లో మంత్రిగా పనిచేశారు. కానీ జగన్ కేబినెట్ 2.0లో బాలినేనికి చోటు దక్కలేదు. అప్పుడు సీఎం జగన్ పై అలక బూనారు. ఆ తర్వాత ఆయనను సీఎం జగన్ బుజ్జగించడంతో శాంతించారు. అయితే ఇటీవల బాలినేని వైసీపీ అధిష్టానానికి రాసిన లేఖ ఆ పార్టీలో ప్రకంపనలు రేపింది. నెల్లూరు, తిరుపతి, వైయస్ఆర్ జిల్లాల వైసీపీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన ఆ లేఖలో పేర్కొనడం సంచలనం సృష్టించింది.
అనారోగ్యం, సొంత నియోజకవర్గం ఒంగోలుపై మరింత దృష్టి సారించేందుకు తాను పార్టీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో బాలినేని పేర్కొన్నారు. అయితే మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకడం, తన జిల్లా నుంచి మరో మంత్రి ఆదిమూలపు సురేష్ను కొనసాగించడంపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇటీవల మార్కాపురంలో సీఎం జగన్ పర్యటన సమయంలో తలెత్తిన ప్రొటోకాల్ వివాదంతో బాలినేని మరింత ఆగ్రహం ఉన్నారని తెలుస్తోంది. అప్పటి నుంచి తనపై ఎవరో ఏదో కుట్ర చేస్తున్నారనే భావనలో బాలినేని ఉన్నారని సన్నిహితులు గుసగుసలాడుతున్నారు.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన డీఎస్పీల బదిలీల విషయంలోనూ తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారని సమాచారం. వీటి వెనుక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఉందని బాలినేని అనుమానిస్తున్నారని టాక్. అందుకే పార్టీ పదవుల్లో కొనసాగటం ఇష్టం లేదని అంటున్నారు.
మరోవైపు బాలినేనిని బుజ్జిగించేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. సీఎం జగన్ను కలవాలని ఆహ్వానించింది. మరి బాలినేని వచ్చి సీఎం జగన్ తో భేటీ అవుతారా..? సీఎంతో చర్చల తర్వాత గతంలో మాదిరిగానే శాంతిస్తారా..? లేక తన దారి చూసుకుంటారా..? పార్టీ మారాలనే యోచనలో ఉన్నారా..?