Brain Cancer:- క్యాన్సర్ను కనుక్కోవడానికి ఎన్నో రకాల అడ్వాన్స్ టెక్నిక్స్ను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు కనిపెడుతూనే ఉన్నారు. అయినా కూడా ఈరోజుల్లో క్యాన్సర్ రకాలు, దాని వల్ల ప్రాణాలకు కలుగుతున్న ముప్పు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో శాస్త్రవేత్తలు కూడా కొత్త కొత్త మార్గాలతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఒక యంగ్ సైంటిస్ట్ బ్రెయిన్ క్యాన్సర్ను కనుక్కోవడానికి ఏఐ సాయం తీసుకోవచ్చని నిరూపించి చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ప్రస్తుతం బ్రెయిన్ క్యాన్సర్లో పలు రకాలు పేషెంట్లను ఇబ్బందిపెడుతున్నాయి. అందులో కొన్ని మనుషులకు ప్రాణాలకే ముప్పు కలిగిస్తున్నాయి. అలాంటి బ్రెయిన్ క్యాన్సర్లలో ఒకటి గ్లయోబ్లాస్టోమా. స్టడీ ప్రకారం ఈ రకమైన బ్రెయిన్ క్యాన్సర్ బయటపడిన తర్వాత మనిషి ఎనిమిది నెలల కంటే ఎక్కువ బ్రతకలేడు. అయితే దీనిని కొంచెం ముందుగానే కనిపెడితే.. దీని వల్ల మనిషికి జరిగే ప్రాణహాని ఏమైనా తగ్గించే వీలు ఉంటుందా అని ఇద్దరు యంగ్ స్టూడెంట్స్కు ఆలోచన వచ్చింది. వారు ఆ కోణంలో పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు.
గ్లయోబ్లాస్టోమా విషయంలో కొత్తగా ఏదైనా సాధించాలి అనుకున్న ఈ విద్యార్థులకు ఒక హాంగ్ కాంగ్ మెడికల్ టెక్నాలజీ కంపెనీ సాయం చేయడానికి ముందుకొచ్చింది. గ్లయోబ్లాస్టోమాకు దారితీస్తున్న మూడు జీన్స్ను వారు కనుగొన్నారు. ఏఐ సాయంతో ఈ బ్రెయిన్ క్యాన్సర్ గురించి మరింత తెలుసుకున్న విద్యార్థులు.. ఈ కోణంలో పరిశోధనలను వేగవంతం చేసి గ్లయోబ్లాస్టోమా కోసం కొత్త డ్రగ్స్ను తయారు చేయడం మొదలుపెట్టారు. పలువురు పేరున్న సైంటిస్టులు సైతం వీరి పరిశోధనలు తిరిగి చూసేలా చేశారు.
జీన్స్ను స్టడీ చేయడంతో పాటు పరిశోధనలను వేగవంతం చేయడం కోసం కూడా ఏఐను ఉపయోగించామని విద్యార్థులు బయటపెట్టారు. ఒక వ్యాధి గురించి కచ్చితమైన డేటా ఉంటే దాని గురించి పూర్తిగా స్టడీ చేసే అవకాశం ఉంటుందని వారు బయటపెట్టారు. అయితే గ్లయోబ్లాస్టోమా గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెడికల్ సైంటిస్టులకు చాలా తక్కువ సమాచారం ఉందని వారు తెలిపారు. ఈ బ్రెయిన్ క్యాన్సర్ అనేది ఎక్కువగా పెద్ద వయసు ఉన్నవారికే వస్తుందని, దాదాపు 50 శాతం పేషెంట్లు 65 ఏళ్లు పైబడిన వారే అని అన్నారు. ఈ కోణంలో మరిన్ని పరిశోధనలు చేసి గ్లయోబ్లాస్టోమా పేషెంట్లను కాపాడే ప్రయత్నం చేస్తామని ఆ విద్యార్థులు హామీ ఇచ్చారు.