AP : ఏపీలో రజనీకాంత్ స్పీచ్.. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధాన్ని మరింత పెంచింది. విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న సూపర్స్టార్ రజనీకాంత్.. చంద్రబాబును విజన్ ఉన్న నాయకుడిగా పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి బాబుతోనే సాధ్యమని స్పష్టంచేశారు.
రజనీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. రోజా, కొడాలి నాని, జోగి రమేష్ లాంటి నేతలు సూపర్ స్టార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రజనీకాంత్కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందన్నారు. రజనీకాంత్తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు.
చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి కారణం వైఎస్ఆర్ అని ..కానీ చంద్రబాబు కాదని రజనీకాంత్ తెలుసుకోవాలని గట్టిగానే విమర్శలు చేశారు.
వైసీపీ నేతల విమర్శలను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తీవ్ర అహంకారంతో అధికారపార్టీ నేతలు చేస్తున్న విమర్శలను తెలుగు ప్రజలెవరూ సహించరన్నారు. ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని.. అనుభవాలను పంచుకున్న సూపర్స్టార్ రజనీకాంత్పై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం అని చంద్రబాబు ట్వీట్ చేశారు. రజనీ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ కూడా చేయలేదు.. ఎవరినీ చిన్న మాట అనలేదని గుర్తు చేశారు.
పలు అంశాలపై రజనీ కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారని చంద్రబాబు ట్వీట్ లో వివరించారు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్పై వైసీపీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమేనని పేర్కొన్నారు. నోటి దురుసు గల నేతలను సీఎం వైఎస్ జగన్ అదుపులో పెట్టుకోవాలని సూచించారు. రజనీకాంత్ కు క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలన్నారు.