Mann Ki Baat : సామాన్యులతో అనుసంధానానికి మన్ కీ బాత్ కార్యక్రమం వేదికైందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రజల్లోని భావోద్వేగాలను తెలుసుకునేందుకు అవకాశం దక్కిందన్నారు. తన ఆలోచనలను ప్రజలతో పంచుకోగలిగానన్నారు. మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో చేస్తున్న మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ తాజాగా ప్రసారమైంది.
సామాన్యుల కోసం మన్ కీ బాత్ లో ఇచ్చిన సందేశాలను మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం తనను ప్రజలకు మరింత చేరువ చేసిందని చెప్పారు. అసామాన్య సేవలు అందించిన వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం లభించిందని తెలిపారు. మొక్కలు నాటడం, పేదలకు వైద్యం అందించడం, ప్రకృతి రక్షణకు నడుం బిగించడం లాంటి కార్యక్రమాలు తనలో ప్రేరణ నింపాయన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మన్ కీ బాత్లో చర్చించామని మోదీ వివరించారు.
మన్ కీ బాత్ కార్యక్రమం తనకు ఆధ్యాత్మిక సాధనంగా మారిందని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తావించిన ప్రతిఒక్కరూ మన హీరోలు. వాళ్లే ఈ కార్యక్రమానికి జీవం పోశారని స్పష్టం చేశారు. మన్ కీ బాత్లో గత ఎపిసోడ్లలో ప్రస్తావించిన అనేక మంది సామాన్యుల్లో కొంతమందిని ప్రధాని వందో ఎపిసోడ్ లో మరోసారి పలకరించారు. విశాఖపట్నానికి చెందిన వెంకటేశ్ ప్రసాద్ను గుర్తు చేసుకున్నారు. ఆయన దేశీయ వస్తువులను మాత్రమే వినియోగించేలా చార్ట్ను ఎలా రూపొందించారో వివరించారు. ఆయన స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు.
మన కీ బాత్ వందో ఎపిసోడ్ ను కోట్ల మంది ప్రజలు వినేలా బీజేపీ ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా 4 లక్షల ప్రాంతాల్లో స్క్రీన్లు ఏర్పాటు చేసింది. అన్ని రాష్ట్రాల రాజ్ భవన్లు, బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని సీఎంల నివాసాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజ్ భవన్లకు ఆయా రాష్ట్రాల్లో పద్మ అవార్డులు అందుకున్న వారిని ఆహ్వానించారు. మన్ కీ బాత్ వందో ఎపిసోడ్.. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రసారం చేశారు. 2014లో విజయదశమి రోజున మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు.